Covid 19: మోడీ ప్యాకేజీ సరే.. గట్టెక్కాలంటే మరో రూ.10 లక్షల కోట్లు అవసరం!
కరోనా మహమ్మారి కారణంగా భారత్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. తొలుత మార్చి 24వ తేదీ నుండి మూడు వారాల పాటు ప్రకటించారు. వివిధ రాష్ట్రాలు దీనిని ఏ నెల చివరి వరకు పొడిగించాయి. దేశవ్యాప్తంగా దీనిని పొడిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపారాలు, ఉత్పత్తి అన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో 80 కోట్ల మంది ప్రజలకు కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. త్వరలో వివిధ రంగాలకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తారని భావిస్తున్నారు.
లాక్డౌన్ తర్వాత ఈ రంగాల దూకుడు, వీటికి చాలా టైమ్: ఉద్యోగాలపై ప్రభావం
రూ.10 లక్షల కోట్ల వరకు ప్యాకేజీ అవసరం
ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్దీపనల కోసం ఎంత మేరకు అవసరమనే విషయాన్ని గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సీ అంచనా వేసింది. కరోనా దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ కోలుకోవాలంటే రూ.6 లక్షల కోట్ల నుండి రూ.10 లక్షల కోట్ల స్థాయిలో అదనపు ఉద్దీపన ప్యాకేజీ అవసరమని మెకిన్సే అభిప్రాయపడింది.
100 సంస్థల నిపుణులు
ఈ ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ సుస్థిరత కోసం కనీసం రూ.6 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల అదనపు ఉద్దీపనల అవసరముందని తాజా అధ్యయనంలో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల అంచనా, సమస్యల పరిష్కారంపై వివిధ రంగాల్లోని 100 సంస్థల విధానకర్తలు, మార్కెటింగ్ నిపుణులు, సీనియర్ ఆర్థికవేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించింది ఈ సంస్థ. వీటి ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి మరిన్ని ఉద్దీపనలు అవసరమని తెలిపింది.
బ్యాంకింగ్, ఎంఎస్ఎంఈలకు ఇబ్బంది
కరోనా ప్రభావం దేశంపై మూడు విధాలుగా ఉందని తనఅధ్యయనంలో తెలిపింది. కరోనా నేపథ్యంలో ఏర్పడిన విపత్కర ఆర్థిక పరిస్థితులు MSMEలకు భారమని నిపుణులు అభిప్రాయపడినట్లు చెప్పింది. బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఐలు పెరగవచ్చునని తెలిపింది.
జీడీపీ భారీ పతనం
ఈ నెల 15కు లాక్ డౌన్ ఎత్తివేస్తే ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 1 శాతం నుంచి 2 శాతం నమోదు కావొచ్చునని అంచనా వేసింది. మే ప్రథమార్థం వరకు ఉంటే మైనస్ 2 శాతం నుంచి మైనస్ 3 శాతానికి పతనం కావొచ్చునని తెలిపింది.
అన్ని రంగాలకు ఇబ్బంది
ఇండియాలో ఎక్కువగా అసంఘటిత రంగంలోనే పని చేస్తున్నారని, రోజువారీ కూలీలు ఎక్కువగా ఉన్నారని, వీరి భవితవ్యం ప్రమాదంలో పడిందని ఈ సర్వే తెలిపింది. కొనుగోళ్ల సామర్థ్యం పెంచేలా భారీగా అన్ని రంగాలకు ఉద్దీపనలు ప్రకటిస్తే పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొంది. విమానయానం, పర్యాటక రంగాలు తీవ్రంగా నష్టపోయిందని తెలిపింది. ఐటీ అనుబంధ సేవలు, ఫార్మా, నిర్మాణ, బ్యాంకింగ్ రంగాలకు కూడా ఇబ్బందికరమేనని వెల్లడించింది.
ఏ రంగంపై ఎంత ప్రభావం
దుస్తులు, ఫర్నిషింగ్ వంటి వాటిలో 30 శాతం డిమాండ్ వరకు పడిపోవచ్చునని, ఫుడ్, యుటిలిటీస్ డిమాండ్ 10 శాతం మేర పడిపోవచ్చునని అంచనా వేసింది. ఎంఎస్ఎంఈ, ఎస్ఎంఈల రుణాలు 25 శాతం వరకు డిఫాల్టుగా మారే ప్రమాదముందని తెలిపింది. ఇది కార్పోరేట్ సెక్టార్లో 6 శాతం, రిటైల్ సెగ్మెంట్లో 3 శాతం ఉంటుందని పేర్కొంది.
ఇప్పటికే చర్యలు.. మరిన్ని అవసరం
లిక్విడిటీని అందించేందుకు, నష్టాన్ని తగ్గించేందుకు, నిరుపేదలకు బాధలు తగ్గించాలంటే ప్రభుత్వం ఇప్పటికే రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని గుర్తు చేసింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే రూ.10 లక్షల కోట్లు లేదా జీడీపీలో 5 శాతం మొత్తంతో చర్యలు అవసరమని తెలిపింది. అసంఘటిత రంగంలోని 13.5 కోట్ల మంది కార్మికులకి ప్రత్యక్ష ఆదాయ సహకారం అవసరమని తెలిపింది. హోమ్ బయ్యర్స్కు ఇచ్చే రాయితీలను కూడా అన్వేషించవచ్చునని సూచించింది.