దిగుమతుల ఎఫెక్ట్, ఈ ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతా మిగులు: CEA
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశం కరెంట్ ఖాతా మిగులును నమోదు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదార కేవీ సుబ్రమణియన్ అన్నారు. కరోనా నేపథ్యంలో దిగుమతులు క్షీణించాయని, దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత కరెంట్ అకౌంట్ మిగులును నమోదు చేయవచ్చునని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉందని, అయితే మనపై ప్రభావం కాస్త భిన్నంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీ బాడీ సీఐఐ నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
టెలికం ఛార్జీలు పెంచకతప్పదు, కానీ: ఎయిర్టెల్ మిట్టల్, 5Gలో చైనా కంపెనీలపై...
ఇది భిన్నమైన సంక్షోభం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 20 బిలియన్ డాలర్ల (19.8 బిలియన్ డాలర్లు) కరెంట్ ఖాతా మిగులు ఉందని, తర్వాత త్రైమాసికాల్లో కరెంట్ ఖాతా ఈ స్థాయి మాదిరి నమోదు కానప్పటికీ పూర్తి సంవత్సరానికి కరెంట్ ఖాతా మిగులు కనిపించే అవకాశాలు ఉన్నాయని సుబ్రమణియన్ అన్నారు. మహమ్మారి కారణంగా స్వల్పకాలంలో వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడిందని, ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మధ్య, దీర్ఘకాలంలో కరోనా ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదని తెలిపారు. గతంలో వచ్చిన ఆర్థిక సంక్షోభాలతో పోలిస్తే ప్రస్తుత సంక్షోభం భిన్నమని చెప్పారు.
ప్రభుత్వం భేషై నిర్ణయాలు
కరోనాను భారత్ ముందుగానే గుర్తించి కఠిన చర్యలు తీసుకుందని ప్రపంచంలోనే సుదీర్ఘ లాక్ డౌన్తో పాటు వివిధ ప్రభుత్వ చర్యలను ఉద్దేశించి అన్నారు. కరోనా ఉదృతిని తగ్గించే చర్యలతో పాటు, ఆర్థిక వ్యవస్థ పుంజుకునే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కరోనా సంక్షోభంలో ఎక్కువగా ప్రభావం పడింది డిమాండ్ పైన అని గుర్తు చేశారు. కరోనా ప్రభావం నుండి ఆర్థిక వ్యవస్థను బయటపడేయడంలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించిందన్నారు.
అనేక సంస్కరణలు
ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందన్నారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ తీసుకు వచ్చిందని, ఆ తర్వాత దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న వ్యవసాయ, కార్మిక సంస్కరణలు ఉన్నాయన్నారు. వ్యవసాయ సంస్కరణలు, ఎంఎస్ఎంఈ అర్థంలో మార్పులు, పనితీరు అనుసంధాన ప్రోత్సాహకాలు ఇలా ఎన్నో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ స్వావలంభన కోసం అన్నారు.