చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు: షుగర్ షేర్ల ధరలు ఢమాల్
న్యూఢిల్లీ: కొద్దిరోజుల కిందటే కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతులను నిషేధించింది. దీనిపై విమర్శలు తలెత్తడంతో ఈ నిషేధాజ్ఞల్లో కొన్ని సవరణలు చేసింది. పాక్షికంగా గోధుమలను ఎగుమతి చేయడానికి అనుమతి ఇచ్చింది. భారత్ నుంచి గోధుమల ఎగుమతులు తగ్గిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వాటి రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పుడు తాజాగా చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పడింది. చక్కెర ఎగుమతులను నియంత్రించడానికి చర్యలు తీసుకుంది. ఆంక్షలను విధించనుంది.
ఆరేళ్ల తరువాత..
ఆరు సంవత్సరాల తరువాత కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులను నియంత్రించడం ఇదే తొలిసారి అవుతుంది. చక్కెర ఎగుమతుల్లో ప్రపంచ దేశాల్లో రెండో అతిపెద్ద దేశంగా ఉంటోంది భారత్. బ్రెజిల్ తరువాత రెండో అతిపెద్ద దేశం ఇదే. బంగ్లాదేశ్, ఇండొనేషియా, మలేసియా, దుబాయ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, కొన్ని ఆఫ్రికన్ దేశాలకు భారత్ బిగ్గెస్ట్ షుగర్ ఎక్స్పోర్టర్గా ఉంటోంది. 2018-19లో 38 లక్షల టన్నుల చక్కెరను భారత్ ఎగుమతి చేసింది.
10 మిలియన్ టన్నులకే పరిమితం..
ఆ మరుసటి సంవత్సరం అంటే 2019-20లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. 59.60 లక్షల టన్నులకు చేరింది. 2020-21లో నమోదై చక్కెర ఎగుమతులు 70 లక్షల టన్నులు. కాగా- ప్రతి సంవత్సరం భారీగా నమోదవుతోన్న చక్కెర ఎగుమతులను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఎగుమతుల పరిమాణాన్ని 10 మిలియన్ టన్నులకే పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్లో పండగ సీజన్ నేపథ్యంలో..
అక్టోబర్లో పండగల సీజన్ ఆరంభమైన తరువాత దేశీయ మార్కెట్లో చక్కెరకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఈ ఆంక్షలు అనేవి సెప్టెంబర్లో అమల్లోకి వస్తాయని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులను నియంత్రిస్తుందంటూ వచ్చిన వార్తల ప్రభావం స్టాక్ మార్కెట్పై పడింది. చక్కెర మిల్లులకు సంబంధించిన షేర్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.
షుగర్ స్టాక్స్ ఢమాల్..
బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో అవధ్ షుగర్ అండ్ ఎనర్జీ-11.07, ధామ్పూర్ షుగర్-5, బల్రామ్పూర్ చీనీ మిల్స్-9.89, ఈఐడీ ప్యారీ-3.42, ఉగర్ షుగర్-4.99, మగధ్ షుగర్ అండ్ ఎనర్జీ-10.72 శాతం మేర షేర్ల ధరలు క్షీణించాయి. అన్నింటికంటే శ్రీ రేణుకా షుగర్స్ అత్యధికంగా నష్టపోయింది. ఈ కంపెనీకి చెందిన షేర్ల ధరలు 13.84 శాతం పడిపోయాయి. ఇతర షుగర్ కంపెనీలకు చెందిన షేర్లన్నీ కూడా రెడ్ జోన్లో ట్రేడ్ అయ్యాయి.