ప్రపంచానికి వ్యాక్సీన్ అందించగలిగే సత్తా భారత్కు ఉంది, ఇక్కడి నుండే ఎన్నో..: బిల్ గేట్స్
కేవలం తమ దేశానికే కాదని, ప్రపంచానికే కరోనా వ్యాక్సీన్ అందించే సత్తా ఇండియన్ ఫార్మా కంపెనీలకు ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, ఫిలాంత్రపిస్ట్ బిల్ గేట్స్ అన్నారు. ఇండియన్ ఫార్మారంగానికి ఆయన కితాబివ్వడంతో పాటు ఔషధ కంపెనీల పేర్లను కూడా ప్రస్తావించారు. సీరం ఇనిస్టిట్యూట్, బయో-ఈ, భారత్ బయోటెక్లపై ఆయన ప్రత్యేక ప్రశంసలు గుప్పించారు. కేవలం భారత్కే కాకుండా ప్రపంచానికే వ్యాక్సీన్ను తయారు చేయగల సామర్థ్యం భారత్ ఔషధ పరిశ్రమకు ఉందన్నారు.
కరోనా వ్యాక్సీన్ కోసం ఆక్స్ఫర్డ్కు లక్ష్మీమిట్టల్ భారీ విరాళం
భారత్లో ఎన్నో పరిణామాలు..
భారత్ నుండి ఎన్నో ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని బిల్ గేట్స్ అన్నారు. అలాగే, ఇండియన్ ఫార్మా రంగం కరోనా వైరస్ వ్యాక్సీన్ను అభివృద్ధి చేయడంలో విశేష కృషి చేస్తోందన్నారు. ఎన్నో వ్యాధుల నుండి రక్షణ పొందేందుకు వ్యాక్సీన్లు భారీ ఎత్తున, ఉత్తమ నాణ్యతతో తయారవుతున్నాయని తెలిపారు. ఈ మేరకు ఆయన కొవిడ్ 19, వైరస్ పైన భారత్ పోరు డాక్యుమెంటరీలో బిల్ గేట్స్ వెల్లడించారు. వ్యాక్సీన్స్ ప్లాట్ ఫామ్ అందించేందుకు ఉద్దేశించిన కొయిలేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్తో (సీఈపీఐ) భారత్ చేతులు కలిపిందన్నారు. ఇతర వ్యాధులకు మందుల్ని తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన సదుపాయాల్ని కరోనా వ్యాక్సిన్ తయారీకి ఉపయోగిస్తున్నారని తెలిపారు.
ఈ సంస్థలున్నాయి
భారత ఫార్మా కంపెనీలు ప్రపంచంలో ఎక్కడా లేనంత భారీస్థాయిలో వ్యాక్సీన్స్ను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. ఎన్నో వ్యాధులకు వ్యాక్సీన్లు ఇక్కడి నుండే వస్తున్నాయన్నారు. వీటిని తయారు చేస్తున్న సంస్థల్లో సీరం ఇన్స్టిట్యూట్, బయో-ఈ, భారత్ బయోటెక్ లాంటి సంస్థలు ఉన్నాయన్నారు. వివిధ వ్యాధులకు కొత్త వ్యాక్సీన్స్ను అందుబాటులోకి తెచ్చేందుకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ రెండు దశాబ్దాలుగా భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తోందన్నారు. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో తమ ఫౌండేషన్ చురుకుగా పని చేస్తోందన్నారు.
అందుకే ఆరోగ్య సంరక్షణ సవాళ్లు
దేశ విశాల పరిమాణానికి తోడు పట్టణాల్లో జన సాంధ్రత తీవ్రంగా ఉండటంతో భారత్లో ఆరోగ్య సంరక్షణ పరంగా సవాళ్లు ఎదురవుతున్నాయని బిల్ గేట్స్ అన్నారు. ప్రజల రాకపోకల వల్ల కరోనా వ్యాప్తి విస్తరిస్తోందన్నారు. ఉపాధికి దూరం కాకుండానే, వైరస్ విస్తరించకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచన చేశారు.