CMD పదవిపై ముఖేష్ అంబానీ, రిషద్ ప్రేమ్జీ సహా వారికి 'రెండేళ్ల' ఊరట
ముంబై: లిస్టెడ్ కంపెనీల్లో చైర్మన్, మైనేజింగ్ డైరెక్టర్ పదవుల్లో వేర్వేరు వ్యక్తులు ఉండాలన్న నిబంధనల అమలును సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) రెండేళ్ల పాటు వాయిదా వేసింది. కార్పోరేట్ల నుంచి విజ్ఞప్తులకు తోడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. సెబి నిబంధనల మేరకు టాప్ 500 లిస్టెడ్ కంపెనీల్లో 2020 ఏప్రిల్ 1 నుంచి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పదవులను విడదీయాలి. సీఎండీ పేరిట ఒకరే నిర్వహించరాదు.
కొత్త రూల్: విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీకి పదవీ గండం? జాబితాలో పెద్ద కంపెనీలు...
పదవులు విడదీసి...
ఈ పదవులను విడదీయడం ద్వారా కార్పోరేట్ పాలనా ప్రమాణాలు మెరుగుపరచాలని సెబి భావిస్తోంది. ఈ నిబంధన అమలు తేదీని 2022 ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సెబి నోటిఫికేషన్ వెల్లడించింది. జనవరి 10వ తేదీతో ఈ నోటిఫికేషన్ వచ్చింది. వాయిదాకు కారణాలు మాత్రం పేర్కొనలేదు.
సమయం కావాలని విజ్ఞప్తి
లిస్టెడ్ కంపెనీలు సెబి నిబంధనలు పాటించేందుకు సమయం కావాలని ఫిక్కీ, సీఐఐ మొదలగు వాటి నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. పైగా ప్రస్తుతం ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా వివిధ కారణాలతో వాయిదా వేసినట్లుగా భావిస్తున్నారు.
షేర్ హోల్డర్ల ప్రయోజనాలకు ఇబ్బంది..
ప్రస్తుతం టాప్ 500 లిస్టెడ్ కంపెనీల్లో సగం వరకు మాత్రమే ఈ నిబంధనలు పాటిస్తున్నాయి. చాలా కంపెనీలు రెండు పదవులను సీఎండీగా విలీనం చేయడంతో బోర్డు, మేనేజ్మెంట్లో ఒకే వ్యక్తి ఉంటున్నారు. ఇది షేర్ హోల్డర్స్ ప్రయోజనాలకు ఇబ్బందిగా ఉంటుందని భావించి సెబి పదవులను విభజించినట్లు మే 2018న తెలిపింది.
రిలయన్స్, విప్రో...
రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, హీరో మోటోకార్ప్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా వంటి దిగ్గజ కంపెనీల్లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవులను ఒకరే నిర్వహిస్తున్నారు. ఎన్ఎస్ఈ ఇన్ఫోబేస్ డేటా ప్రకారం టాప్ 500 లిస్టెడ్ కంపెనీల్లో 162 కంపెనీల్లో ఒకే వ్యక్తి చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా ఉన్నారు. మరో 52 కంపెనీల్లో చైర్ పర్సన్ మరియు ఎండీ/సీఈవో ఉన్నారు.
వారికి ఊరట
సెబి తీసుకున్న నిర్ణయాన్ని ఇండస్ట్రీ వర్గాలు స్వాగతించాయి. రెండేళ్లు పొడిగించడం శుభపరిణామమని, కుటుంబ సభ్యుల వ్యాపారాలు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తాయని ఫిక్కీ ప్రెసిడెంట్ సంగీతా రెడ్డి తెలిపారు. అనేక కుటుంబ సభ్యులు నడుపుతున్న సంస్థలకు ఇది ఊరట అన్నారు. సెబి నిర్ణయం రిలయన్స్ (ముఖేష్ అంబానీ), విప్రో వంటి వివిధ సంస్థలకు తాత్కాలిక ఊరట.