ఉద్దీపన చర్యలను వెనక్కి తీసుకోవాలనే తొందరేమీ లేదు: నిర్మలమ్మ
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రకటించిన వివిధ ఉద్దీపన ప్యాకేజీలను ఉపసంహరించుకోవడానికి ఎలాంటి తొందరలేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ రికవరీకి అవసరమైతే మరిన్ని చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. 'అవి కొనసాగుతాయి' అని ఉద్దీపన ప్యాకేజీని ఉద్దేశించి నిర్మలమ్మ న్యూయార్క్ సండేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కరోనా ప్రభావాన్ని అధిగమించడానికి చిన్న వ్యాపారులకు, పరిశ్రమలకు, సామాన్యులకు ఎన్నో ప్రయోజనాలు కేంద్రం కల్పించింది. వీటిని మరింత కాలం కొనసాగిస్తామని తెలిపారు. ఆరోగ్య మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రాధాన్యత కొనసాగుతుందన్నారు. నిర్మలా సీతారామన్ వచ్చే ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు.
సప్లై చైన్
కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రకటించిన పలు ఉద్దీపన పథకాలను ఉపసంహరించేందుకు తొందర ఏమీ లేదని తేల్చి చెప్పారు. తద్వారా మరింతకాలం ఉపశమన చర్యలు కొనసాగే అవకాశముందని సంకేతాలిచ్చారు. అయితే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను త్వరితగతిన గాడిన పెట్టాలనే తమ లక్ష్యంలో కొంత అస్థిరత తలెత్తే అవకాశముందన్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పటికే మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం భారీ ఎత్తున ఖర్చు చేసేందుకు సిద్ధమైందని తెలిపారు. కొవిడ్ 19ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల సహకారం అవసరమన్నారు. అలాగే సప్లై చైన్ను కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో వినియోగించే ముడి సరకుల నిమిత్తం నిరంతరం తెరిచే ఉంచాలన్నారు.
చమురు ధరలపై ఆందోళన
ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా, జాతీయంగా చమురు ధరల పెరుగుదల పెద్ద సవాల్ అని, ఆర్థికమంత్రిత్వ శాఖకు చెందిన టీమ్ కూడా పరిశీలిస్తోందన్నారు. ఈ అనిశ్చితి తమ ముందున్న అతిపెద్ద సవాల్ అన్నారు. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్లో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను విక్రయించడం జరుగుతోంది. అలాగే పెట్టుబడుల మూలధనం కోసం విదేశీ రుణ ప్రవాహాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ అంశంపై కూడా ఆమె స్పందించారు. ఎల్ఐసీ లిస్టింగ్ ఈ ఏడాది పూర్తవుతుందా అని అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ దీనిని పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు.
జీడీపీ వృద్ధి రేటు
కరోనా నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఫస్ట్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ సెకండ్ వేవ్ ప్రభావం కొంతమాత్రమే కనిపించింది. భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో వివిధ రేటింగ్ ఏజెన్సీలు FY22 జీడీపీ వృద్ధి రేటు అంచనాలను సవరిస్తున్నాయి. కేంద్ర బ్యాంకు ఆర్బీఐ అంచనాల ప్రకారం భారత జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతంగా నమోదు కావొచ్చు. గత ఏడాది మైనస్ 7.3 శాతంగా నమోదయింది. బ్లూమ్బర్గ్ అంచనాలప్రకారం 7.8 శాతంగా ఉండవచ్చు.