కరోనా భారత్కు ఒక అవకాశం, వేగంగా కోలుకుంటున్నాం: నిర్మలా సీతారామన్
కరోనా మహమ్మారి సంక్షోభాన్ని భారత్ ఒక అవకాశంగా మలుచుకుందని, కేవలం ఉద్దీపన చర్యలకే పరిమితం కాకుండా నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వాషింగ్టన్లో జరుగుతున్న ప్రపంచబ్యాంకు అభివృద్ధి కమిటీ సమావేశంలో గురువారం ఆమె మాట్లాడారు. కరోనా సంక్షోభ సమయంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్కు 82 బిలియన్ డాలర్ల FDIలు వచ్చాయన్నారు. భారత్ పెట్టుబడులకు స్వర్గదామమని ఇది సూచిస్తోందన్నారు. కరోనాను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందన్నారు.
జీవితం, జీవనాధారం... రెండింటి లక్ష్యంగా చర్యలు చేపట్టామన్నారు. కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా ఒకేసారి వెలుగు చూడలేదన్నారు. దీంతో స్థానిక లాక్డౌన్ ద్వారా కట్టడి చేశామన్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడలేదన్నారు. సెకండ్ తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ 20.1 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందన్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో భారత్ 20.1 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని గుర్తు చేశారు. సెకండ్ వేవ్ అనంతరం ఆంక్షలు ఎత్తివేశాక గత మూడు నెలలుగా జీఎస్టీ వసూళ్లు లక్షకోట్ల రూపాయలు దాటుతున్నాయన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందనడానికి ఇది ఒక నిదర్శనం అన్నారు. రానున్న నెలల్లో మరింత జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. వ్యాక్సీన్ పంపిణీ విషయంలో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని చెప్పారు. సెప్టెంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా 951.35 మిలియన్ డోసులు పంపిణీ చేసినట్లు చెప్పారు. పద్దెనిమిదేళ్లు పైబడిన వారిలో 72.8 శాతం మందికి కనీసం ఒక డోస్ వ్యాక్సీన్ అందినట్లు తెలిపారు. అలాగే వ్యాక్సిన్ మైత్రి పేరిట ప్రపంచదేశాలకు వీటిని అందించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ కోసం రూపొందించిన కొవిన్ యాప్ కొవిడ్పై పోరులో ప్రపంచవ్యాప్తంగా సమర్థమైన సాధనంగా మారిందన్నారు.