భారత్లో నిరుద్యోగిత రేటు ఎంత ఉందంటే, మహిళలు ఎందుకు రావట్లేదు..
భారత్లో డిసెంబర్ 2021 నాటికి 53 మిలియన్ల మంది నిరుద్యోగులు ఉన్నట్లుగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) వెల్లడించింది. ఈ నిరుద్యోగుల్లో మహిళల వాటా ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ నిరుద్యోగుల్లో 35 మిలియన్ల మంది ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. 17 మిలియన్ల మందికి ఎలాంటి అవకాశాల్లేవు. ఇందులో మహిళలు 9 మిలియన్ల మంది ఉన్నారు. దేశంలో గత నెలలో నిరుద్యోగిత రేటు 7.9 శాతం లేదా ఉద్యోగం లేనివారు 35 మిలియన్ల ఉపాధి కోసం వెతుకుతున్నారు.
ప్రపంచ ఉపాధి రేటు ప్రమాణాలను భారత్ అందుకోవాలంటే అదనంగా 18.75 కోట్ల మందికి ఉద్యోగాలను కల్పించాల్సి ఉందని సీఎంఐఈ పేర్కొంది. అంతర్జాతీయ నిరుద్యోగుల సంఖ్య 20.7 కోట్లుగా ఉంటుందని ఐఎల్వో తాజా నివేదిక తెలిపింది.
నిరుద్యోగులు..
దేశంలో 3.5 కోట్ల మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, వారు ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని సీఎంఐఈ తెలిపింది. నిరుద్యోగ రేటులో 7.9 శాతంగా ఉన్న వీరికి తక్షణమే ఉపాధి కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని పేర్కొంది. ఇందులో 23 శాతం మంది లేదా 8 మిలియన్ల మంది మహిళలు ఉన్నారు. అవకాశం రాని నిరుద్యోగులు 1.7 కోట్లు ఉండగా, ఇందులో మహిళల వాటా 53 శాతం లేదా 90 లక్షలుగా ఉంది. వీరి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే యాక్టివ్గా వర్క్ కోసం చూడటం లేదని తెలిపింది.
ఎందుకో..
పని చేయడానికి ఆసక్తిగా ఉన్న మహిళలు ఎందుకు దరఖాస్తు చేయడం లేదా అనే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది. ఉద్యోగాల లభ్యత లేకపోవడమా లేక శ్రామిక శక్తిలో చేరడానికి మహిళలకు సామాజిక మద్దతు లేకపోవడమా అనే కోణంలో పరిశోధించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
బడ్జెట్లో...
ప్రపంచ బ్యాంకు నుండి వచ్చిన డేటాను ఉటంకిస్తూ 2020 మహమ్మారి సమయంలో ప్రపంచ ఉపాధి రేటు 55 శాతం లేదా 2019లో 58 శాతంగా ఉందని పేర్కొంది. అదే సమయంలో భారత్లో 43 శాతంగా ఉందని తెలిపింది. భారత నిరుద్యోగ సమస్య వాస్తవ నిరుద్యోగ రేటును ప్రతిబింబించదని, తక్కువ ఉపాధి రేటు, తక్కువ మహిళా శ్రామిక శక్తి సమస్య అని పేర్కొంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. కరోనా సమయంలో పెరిగిన నిరుద్యోగాన్ని తగ్గించేలా రూపకల్పన చేస్తారని భావిస్తున్నారు.