పెరుగుతున్న కరోనా... తెలుగు రాష్ట్రాలు సహా ఇవే కీలకం, భారత ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ
కరోనా మహమ్మారి ప్రభావం భారత్ సహా ప్రపంచ దేశాలపై భారీగా ఉంటుందని సింగపూర్ బ్రోకరేజీ సంస్థ డీపీఎస్ బుధవారం పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రాష్ట్రాల్లో ఇంకా కరోనా ప్రభావం తగ్గలేదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6 శాతం ప్రతికూలత నమోదు కావొచ్చునని డీబీఎస్ నివేదిక తెలిపింది. అంతకుముందు ఇదే సంస్థ మైనస్ 4.8 శాతంగా అంచనా వేసింది. ఇప్పుడు మరింత ప్రభావం ఉంటుందని చెబుతూ, వృద్ధి రేటును సవరించింది.
నగదు కొరత, ఈ రంగంలో కోట్లాది ఉద్యోగాలు పోయినట్లే! చైనా వస్తువులు వద్దంటే..
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కీలక రాష్ట్రాలు ఇలా..
ఈ నివేదిక ప్రకారం భారత్కు ఆర్థికంగా కీలకమైన పలు రాష్ట్రాలు ఇంకా కరోనా మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. జాతీయ ఆర్థిక ఉత్పత్తిలో 30.5 శాతానికి సమానమైన మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అలాగే, ఆర్థిక వ్యవస్థకు ఇతర కీలక రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి తెలుగు రాష్ట్రం)లలో ఆయా రాష్ట్రాలకు 70 శాతం వాటా కలిగిన ప్రాంతాలు కరోనా బారిన పడ్డాయని అభిప్రాయపడింది.
ఆర్థిక వ్యవస్థ మరింత కుంచించుకుపోయేలా..
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కీలక రాష్ట్రాలలో కేసులు పెరుగుతుండటం భారత రికవరీ ఆలస్యానికి కారణంగా మారుతోందని, అలాగే ఆర్థిక వ్యవస్థ మరింత కుంచించుకుపోయేలా చేస్తోందని డీబీఎస్ నివేదిక తెలిపింది. భారత్లో కరోనా కేసులు 12 లక్షలు దాటాయి. మరణాలు 29 వేలకు చేరువయయాయి. అమెరికా, బ్రెజిల్ తర్వాత ఎక్కువ కేసులు ఉన్న దేశంగా భారత్ నిలిచింది. అన్-లాక్ అయినప్పటికీ కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా ప్రారంభం కావడం లేదని ఈ పరిస్థితుల్లో FY21లో ఆర్థిక వృద్ధిని మైనస్ 6 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు డీబీఎస్ ఎకనమిస్ట్ రాధిక రావు అన్నారు.
మరోసారి ఆర్థిక ప్యాకేజీ
ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో రెండంకెల ప్రతికూలత నమోదు చేస్తుందని, రెండో త్రైమాసికంలో కాస్త పుంజుకుంటుందని, మూడో త్రైమాసికానికి వృద్ధి బాట పడుతుందని రాధిక రావు తెలిపారు. జాతీయ జీడీపీలో మహారాష్ట్ర వాటా 14 శాతం, తమిళనాడు వాటా 8.5 శాతం, గుజరాత్ వాటా 8 శాతంగా ఉండగా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వాటా జాతీయ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు. పలు నగరాల్లో లాక్ డౌన్ కొనసాగుతోందని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మరో విడత ఆర్థిక ప్యాకేజీ కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు.