భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది: ఐక్య రాజ్య సమితి
భారత ఆర్థిక వ్యవస్థ, రికవరీపై ఐక్య రాజ్య సమితి సానుకూల దృక్పథంతో ఉంది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అదరగొడుతుందని ఐక్య రాజ్య సమితి నివేదిక పేర్కొంది. ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధ పరిణామాలు, ప్రపంచ జీడీపీ వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయి. అయితే 2022 క్యాలెండర్ ఏడాదిలో దేశ జీడీపీ 6.4 శాతంగా నమోదు కావొచ్చునని ఈ నివేదిక అంచనా వేసింది. గత ఏడాది నమోదైన 8.8 శాతంతో పోలిస్తే ఇది తక్కువ అని, కానీ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన దేశంగా ఈ ఏడాది కూడా భారత్ కొనసాగుతుందని తెలిపింది.
అధిక ద్రవ్యోల్భణ ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రయివేటు వినియోగం, పెట్టుబడులపై ప్రభావం ఉన్నప్పటికీ, వృద్ధి విషయంలో భారత్ రాణిస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం కారణంగా ఏర్పడిన పరిస్థితులతో కరోనా నుండి పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడింది. ఐరోపాలో సంక్షోభం తలెత్తింది. ఆహార, వస్తువుల ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా ద్రవ్యోల్భణ ఒత్తిళ్లు పని చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు నివేదికలో ఐక్య రాజ్య సమితి తెలిపింది.
2022 క్యాలెండర్ ఏడాదిలో భారత్ 6.4 శాతం, అమెరికా 2.6 శాతం, చైనా 4.5 శాతం, ఐరోపా సమాఖ్య 2.7 శాతం, వర్థమాన దేశాలు 4.1 శాతం, ప్రపంచం మొత్తం 3.1 శాతంగా అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదిలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 3.1 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చునని పేర్కొంది.