OTP Troubles: కొత్త నిబంధనలు, నిలిచిపోయిన OTP సేవలు
OTPకి సంబంధించి సోమవారం అంతరాయం ఏర్పడింది. వాణిజ్య సందేశాల నియంత్రణ కోసం టెల్కోలు సోమవారం నుండి కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చాయి. అయితే ఈ కొత్త నిబంధనలు గందరగోళానికి దారితీశాయి. దీంతో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు చెల్లింపులు, రైల్వే టిక్కెట్ బుకింగ్, ఈ-కామర్స్, ఆధార్ ధృవీకరణ, కోవిన్ దరఖాస్తు వంటి ఆన్లైన్ సేవల్లో అంతరాయం కలిగింది.
ఎస్సెమ్మెస్, OTP సందేశాలు కస్టమర్లకు రాలేదు. సోమవారం సాయంత్రం వరకు దాదాపు 40 శాతం సందేశాలు నిలిచిపోయాయి. టెల్కోలు అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనలతో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ సమస్య వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇటు టెలికం కంపెనీలు, అటు పేమెంట్ వంటి ఇతరసంస్థలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి.
కొత్త నిబంధనలను అమలు చేసే ప్రక్రియలో కంపెనీలు చేసిన తప్పిదం అంతరాయానికి కారణమైనట్లు టెలికం సంస్థలు వెల్లడించాయి. సందేశాలు పంపించేవారి ఐడీలను కొత్తగా తీసుకు వచ్చిన బ్లాక్ చైన్ ప్లాట్ఫాంపై రిజిస్టర్ చేయకపోవడం వల్ల సందేశాలు వెళ్లలేదని తెలిపాయి. వాణిజ్య సందేశాలకు సంబంధించి మూడేళ్ల క్రితం ట్రాయ్ కొత్త నిబంధనలు జారీ చేయగా, ఇవి నిన్నటి నుండి అమల్లోకి వచ్చాయి.