అప్పుడే చైనా కంటే భారత్ చౌకగా తయారు చేయగలదు, ఉద్యోగాలపై అది సరికాదు
ముంబై: విధానాల అనుకూలంగా ఉంటే 'తక్కువ ధరకు తయారీ'లో చైనాను భారత్ అధిగమించగలదని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. ప్రభుత్వం, పరిశ్రమ సమన్వయంతో పని చేస్తే తక్కువ ధరకు తయారు చేయగలమన్నారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (AIMA) నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. భారతీయ పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారతీయ తయారీని అంతర్జాతీయంగా పోటీలో నిలపడంపై ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు.
LTC క్యాష్ వోచర్ గుడ్న్యూస్: బీమా ప్రీమియంకూ వర్తింపు.. ఈ తేదీల మధ్య
అప్పుడే తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వస్తువులు
భారతీయ పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యం కావాలని ఆర్సీ భార్గవ అన్నారు. అప్పుడు అతి తక్కువ ఖర్చుతో, ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యతతో వస్తువులను తయారు చేయగలమన్నారు. పరిశ్రమ ఎంత ఎక్కువగా విక్రయించగలిగితే అంత ఎక్కువగా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, అలాగే ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందన్నారు. మారుతీ సుజుకీ ప్రతి సంవత్సరం శ్రామికశక్తిని ఎక్కువగా జోడించకుండానే తన సేల్స్ మాత్రం పెంచుకుంటోందన్నారు. తద్వారా సర్వీస్ సెక్టార్లో ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తోందన్నారు.
పోటీపడే స్థాయికి తీసుకెళ్లాలంటే
భారతీయ తయారీ పరిశ్రమను అంతర్జాతీయంగా పోటీపడే స్థాయికి తీసుకు వెళ్లడానికి ఏం చేయాలనే అంశాలపై మాట్లాడుతూ.. భారతీయ పరిశ్రమలో పోటీతత్వాన్ని పెంచడానికి వీలుగా ప్రభుత్వం పలు విధానాలను తీసుకు రావాలని, తద్వారా ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తులను తయారీ పరిశ్రమ అందించగలుగుతుందన్నారు. విక్రయాలు ఎంతగా పెరిగితే అంత ఉద్యోగాల సృష్టి ఉంటుందన్నారు.
ఆ నిబంధనలు సరికాదు
విక్రయాలు పెరిగితే, ఉద్యోగాలు పెరిగి ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో పయనిస్తుందని ఆర్సీ భార్గవ అన్నారు. కొన్ని రాష్ట్రాల్లోని తయారీ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ నిబంధనలు తేవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇది పోటీతత్వానికి వ్యతిరేక చర్య అన్నారు. ఎంఎస్ఎంఈలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద కంపెనీల స్థాయిలో పోటీ పడాలన్నారు.