కరోనా టైంలో ఊరట: ఐటీ రిటర్న్స్ గడువు 2 నెలలు పొడిగింపు
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్, కఠిన ఆంక్షల కారణంగా ప్రజల కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు వివిధ అంశాలకు సంబంధించి కాస్త ఊరట కల్పిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యక్తుల రిటర్న్స్ దాఖలు గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. కంపెనీలకు కూడా రిటర్న్స్ దాఖలుకు నవంబర్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించింది.
కరోనా సమయంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) తెలిపింది. వ్యక్తులకు ఇప్పటి వరకు రిటర్న్స్ దాఖలుకు జులై 31వ తేదీ, కంపెనీలకు అక్టోబర్ 31వ తేదీ వరకు గడువు ఉండేది. కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసే ఫామ్ 16 గడువును కూడా పొడిగించింది. జులై 15 వరకు ఇందుకు గడువును నిర్దేశించింది.
ఇదిలా ఉండగా, ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు మరింత సులభతరం చేసేందుకు కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకు వస్తోంది. పాత పోర్టల్ www.incometaxindiaefiling.gov.in స్థానంలో కొత్త పోర్టల్ www.incometaxgov.inను తీసుకు వస్తోంది. జూన్ 7వ తేదీ నుండి ఈ కొత్త పోర్టల్ అందుబాటులోకి వస్తోంది. ఇందుకోసం జూన్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు పాత పోర్టల్ పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉండటం లేదు.