కరోనా దెబ్బ: పేదల ఆదాయం సగానికి పైగా తగ్గింది. ధనవంతుల ఆదాయం జంప్
గత రెండున్నర దశాబ్దాలుగా భారత్లో ఆర్థిక సరళీకరణలు కనిపిస్తున్నాయి. దేశంలోని 20 శాతం పేదవారి ఆదాయం 1995 నుండి ఆర్థిక సరళీకరణ అనంతరం క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే కరోనా మహమ్మారి వారి ఆదాయాలపై తద్వారా జీవితాలపై పెను ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో పేద భారత కుటుంబాల వార్షిక ఆదాయం 2015-16 స్థాయి నుండి ఈ మహమ్మారి సమయంలో 53 శాతం పడిపోయింది. ఇదే అయిదేళ్ల కాలంలో ధనవంతులైన 20 శాతం మంది వార్షిక ఆదాయం 39 శాతం వృద్ధిని నమోదు చేసింది. కరోనా సమయంలో ధనిక-పేద కుటుంబాల మధ్య పెరిగిన వ్యత్యాసాన్ని ఇది చూపిస్తోంది.
కే షేప్ రికవరీ
ముంబైకి చెందిన థింక్ ట్యాంక్ పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ (PRICE) నిర్వహించిన ICE360 సర్వే 2021లో కరోనా తర్వాత భారత రికవరీ K షేప్లో ఉన్నదని వెల్లడైంది. ఈ సర్వే ఏప్రిల్-అక్టోబర్ కాలంలో నిర్వహించారు. మొదటి రౌండ్లో 2,00,000 కుటుంబాలను, రెండో రౌండ్లో 42,000 కుటుంబాలను సర్వే చేశారు.
ఇది దేశంలోని 100 జిల్లాల్లో 120 పట్టణాల్లో, 800 గ్రామాల్లో జరిగింది. కరోనా నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు త్రైమాసికాల్లో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో జీడీపీ వృద్ధి రేటు ఆ ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.3 శాతానికి పడిపోయింది.
ఎవరి ఆదాయం ఎంత తగ్గిందంటే
కరోనా మహమ్మారి కారణంగా గ్రామీణ పేదల కంటే పట్టణ పేదలు ఎక్కువగా నష్టపోయినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. పట్టణ పేదల ఆదాయం భారీగా తగ్గింది. ఆదాయం ఆధారంగా జనాభాను ఐదు వర్గాలుగా విభజించగా.. కరోనా ప్రభావంతో 20 శాతం మంది పేదల ఆదాయం 53 శాతం తగ్గింది. అదే కాలంలో 20 శాతం మంది దిగుమ మధ్య తరగతి ఆదాయం 32 శాతం తగ్గింది. మిడిల్ క్లాస్ ఆదాయం 9 శాతానికి తగ్గింది. 20 శాతం ఎగువ మధ్య, 20 శాతం ధనవంతుల ఆదాయం వరుసగా 7 శాతం, 39 శాతం పెరిగింది.
ధనికులు.. పేదల ఆదాయం
20 శాతం సంపన్న కుటుంబాలు సరళీకరణ తర్వాత (1995) మొదటిసారి ఓ అయిదేళ్లలో ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకున్నాయని ఈ సర్వే వెల్లడిస్తోంది. అదే సమయంలో 20 శాతం పేదల ఆదాయం భారీగా తగ్గింది. కరోనా కారణంగా పేదలు, మధ్య తరగతిపై భారీ దెబ్బ పడింది. 1995లో 20 శాతం మంది ధనవంతుల ఆదాయం మొత్తం హౌస్ హోల్డ్ ఆదాయంలో 50.2 శాతం కాగా, 2021 నాటికి ఇది 56.3 శాతానికి పెరిగింది. అదే సమయంలో 20 శాతం పేదల ఆదాయం 5.9 శాతం నుండి 3.3 శాతానికి తగ్గింది.