Onion Price: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. కిలో ఉల్లిగడ్డ 220 రూపాయలు..!
ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. కిలో ఉల్లి ఏకంగా రూ.220 లకు చేరింది. అయితే ఈ ఉల్లి ధర భారత్ లో కాదు పాకిస్థాన్ లో. పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభంతో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. రోజు తినే చపాతీల కోసం వినియోగించే గోధుమ పిండి కోసం స్థానిక ప్రజలు కొట్టుకుంటున్నారు. గోధుమ పిండి సరఫరా చేసే లారీలపై దాడులు చేస్తున్నారు. పిండి పంపిణీ చేసే డీలర్ షాపుల వద్ద తీవ్రమైన ఘర్షణలు కూడా జరుగుతున్నాయి.
లీటర్ పాల ధర రూ.150
సంక్షోభం కారణంగా ఒక లీటర్ పాల ధర రూ.150కి చేరింది. 2021 జనవరిలో కిలో రూ.36గా ఉన్న ఉల్లిగడ్డ ధర 2022 జనవరిలో రూ.220కి చేరింది. కిలో చికెన్ ధర రూ. 383గా ఉంది. డజన్ అరటి పండ్ల ధర రూ. 119. లీటర్ మిల్క్ రూ. 150గా ఉంది. వీటితోపాటు ఇతర నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగాయి. పప్పులు, ఉప్పు, బస్మాతి రైస్, ఆవ నూనె, బ్రెడ్, మిల్క్ ధరలతో పాటు అరటి పండ్ల ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోల్, డిజీల్ ధరలు కూడా అమాంతం పెరిగాయి. పెట్రోల్ ధర 48 శాతం పెరిగింది.
గోధుమ పిండి కిలో రూ.160
కరాచీలో కిలో పిండి రూ.160కి అమ్ముతున్నారు. ఇస్లామాబాద్, పెషావర్ నగరాల్లో 10 కిలోల బ్యాగ్ను రూ.1500కు అమ్ముతున్నారు.పంజాబ్ ప్రావిన్సులోని మిల్లు ఓనర్లు గోధమ బ్యాగ్ ధరలను విపరీతంగా పెంచేశారు. అయినా గోధుమ బ్యాగులు ఎక్కడా స్టాక్ లేనట్లు తెలుస్తోంది.
అప్పులు
వరదలవల్ల జరిగిన నష్టాన్ని పూడ్చటానికి పాకిస్థాన్ భారీగా అప్పులు తీసుకుంది. దీంతో 2011లో ఆ దేశ జీడీపీలో 52.8 శాతంగా, 2016లో 60.8 శాతంగా ఉన్న అప్పులు ప్రస్తుతం 77.8 శాతానికి పెరగనున్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. డాలర్తో పాకిస్థాన్ రూపీ మారకం విలువ కూడా రూ.177కు తగ్గింది. ప్రస్తుతం పాక్ ఐఎంఎఫ్ సాయం కోరింది.