నిషేధించాల్సిందే: క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ, సమర్థించిన సెంట్రల్ బోర్డు
క్రిప్టో కరెన్సీ నియంత్రణ కాదని, వీటిని పూర్తిగా నిషేధించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అభిప్రాయపడింది. క్రిప్టోపై పూర్తిస్థాయి నిషేధం విధించాల్సిందేనని ఆర్బీఐ కేంద్ర బోర్డుకు తేల్చి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. వాటిపై పాక్షిక ఆంక్షలు ఫలితాలు ఇవ్వబోనని, బ్యాంకు బోర్డు సమావేశంలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీల వ్యాల్యూ, క్రిప్టో ఎక్స్చేంజీల యాజమాన్య నిర్వహణతోపాటు సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్య సుస్థిరత తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించామని ఆర్బీఐ తెలిపింది. క్రిప్టోలపై ఆర్బీఐ వైఖరిని బ్యాంక్ సెంట్రల్ బోర్డు కూడా సమర్థించినట్లుగా తెలుస్తోంది.
ఆర్బీఐ సవివరంగా క్రిప్టో కరెన్సీ ఆందోళనలపై ప్రజెంటేషన్ ఇచ్చింది. మాక్రో ఎకనమిక్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర దేశాల్లో పుట్టిన వర్చువల్ కరెన్సీని నియంత్రించడం కష్టసాధ్యమని అభిప్రాయపడింది. విదేశీ స్టాక్ ఎక్స్చేంజీల్లో క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్ జరుగుతోందని సభ్యులు పేర్కొన్నారు.
2018లో క్రిప్టోకరెన్సీలను ఆర్బీఐ నిషేధించినా, గత ఏడాది అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఎత్తివేసింది. కొందరు సభ్యులు బ్యాలెన్స్డ్ విధానాన్ని అనుసరించాలని కోరినట్లుగా తెలుస్తోంది. టెక్నాలజీ స్పేస్ విస్తరించడంతోపాటు ఆర్థిక రంగంపై భారీస్థాయిలో ప్రతికూల ప్రభావం చూపుతుందన్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం ప్రతినిధులు వైఖరిని వెల్లడించాల్సి ఉంది. క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.