Bharat Biotechకు బంపర్ ఆఫర్: దక్షిణ అమెరికన్ కంట్రీలో: కోవాగ్జిన్ దిగుమతి
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్.. పోగొట్టుకున్న అవకాశాన్ని చేజిక్కించుకుంది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ను వినియోగించడానికి బ్రెజిల్ ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తమ దేశ ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్ ఇవ్వడానికి కోవాగ్జిన్ను వినియోగించుకోనుందా దక్షిణ అమెరికన్ దేశం. కోవాగ్జిన్తో పాటు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను కూడా దిగుమతి చేసుకోనుంది.
అన్విసాకు పర్యవేక్షణ బాధ్యతలు..
కోవాగ్జిన్ సహా స్పుత్నిక్ వీ దిగుమతికి సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతను బ్రెజిల్కు చెందిన నేషనల్ హెల్త్ సర్వైలెన్స్ ఏజెన్సీ (ఏఎన్వీఐఎస్ఏ-అన్విసా) తీసుకుంది. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధీనంలో కొనసాగే ఏజెన్సీ ఇది. తొలి విడతలో నాలుగు మిలియన్ డోసుల కోవాగ్జిన్ను దిగుమతి చేసుకోబోతోన్నట్లు బ్రెజిల్ తెలిపింది. ఈ నాలుగు మిలియన్ డోసుల వ్యాక్సిన్ను దేశ ప్రజలకు ఇచ్చిన తరువాత.. వెలువడే ఫలితాలను విశ్లేషించిన తరువాత.. కొత్త డోసుల కోసం ఆర్డర్ ఇస్తామని అన్విసా స్పష్టం చేసింది.
ఇదివరకు తిరస్కరణ..
ఇదే భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ను బ్రెజిల్ ఇదివరకు తిరస్కరించింది. గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ (జీఎంపీ)కి అనుగుణంగా వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయట్లేదనే కారణంతో బ్రెజిల్ ఇప్పటికే ఓ సారి ఈ వ్యాక్సిన్ వినియోగానికి అంగీకరించలేదు. వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తోన్న ప్రాంతాలు, ఉత్పత్తి చేసే విధానం.. తాము నిర్దేశించుకున్న నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉండట్లేదంటూ ఈ వ్యాక్సిన్ దిగుమతికి బ్రెజిల్ అంగీకరించలేదు. తాజాగా మరోసారి ఆ దేశ ప్రతినిధులు భారత్ బయోటెక్ను సందర్శించారు. ఈ సారి పరిస్థితులు మెరుగుపడినట్లు భావించినందున.. నాలుగు మిలియన్ డోసుల వ్యాక్సిన్కు ఆర్డర్ ఇచ్చింది.
కోవాగ్జిన్తో పాటు స్పుత్నిక్ వీ కూడా..
కోవాగ్జిన్తో పాటు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ వినియోగానికి కూడా బ్రెజిల్ పచ్చజెండా ఊపింది. తమ వ్యాక్సిన్ వినియోగానికి బ్రెజిల్కు చెందిన అన్విసా అంగీకరించిందని స్పుత్నిక్ వీ తెలిపింది. తాము అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ను వినియోగించబోతోన్న 67వ దేశంగా బ్రెజిల్ను అభివర్ణించింది. అన్విసా వెలిబుచ్చిన సందేహాలన్నింటికీ తాము సరైన సమాధానం ఇచ్చామని, క్లినికల్ ట్రయల్స్, ఇతర డేటాను విశ్లేషించుకోవడానికీ అనుమతి ఇచ్చామని రష్యా పేర్కొంది.
కరోనా మరణాల్లో రెండోస్థానంలో
ఇదిలావుండగా.. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి.. బ్రెజిల్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అమెరికా తరువాత ఆ స్థాయిలో అత్యధిక మరణాలు నమోదైన దేశం ఇదే. ఇప్పటిదాకా కరోనా బారిన పడి 4,70,968 మంది బ్రెజిలియన్లు మరణించారు. కరోనా మరణాల్లో ఈ దేశానిది రెండోస్థానం. అమెరికాలో ఇప్పటిదాకా 6,12,240 కరోనా వల్ల మృతి చెందారు. బ్రెజిల్లో ఇప్పటిదాకా 1,68,41,954 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,52,39,692 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 11,31,294 యాక్టివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. ఈ రెండు దేశాల తరువాత భారత్.. కరోనా మరణాల్లో మూడో స్థానంలో ఉంటోంది.