2009 ఆర్థిక సంక్షోభం కంటే పెను ప్రమాదం: ఐఎంఎఫ్ హెచ్చరిక
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతోంది. భారత ఆర్థిక వ్యవస్థపై కూడా కరోనా ప్రభావం భారీగానే ఉండనుంది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ హెచ్చరికలు జారీ చేసింది. ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై హెచ్చరికలు జారీ చేశారు. 2009 ఆర్థిక సంక్షోభం కంటే కరోనా ప్రభావం భారీగానే ఉంటుందని హెచ్చరించారు.
తక్కువ ఆదాయం కలిగిన దేశాలకు మద్దతుగా నిలవాలని ఆర్థిక వ్యవస్థలకు పిలుపునిచ్చారు. ఈ దేశాలు భారీగా మూలధన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తమ 1 ట్రిలియన్ డాలర్ల రుణ సహాయానికి తాము సిద్ధమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు, సంస్థలు, పరిశ్రమలు క్లోజ్ అయ్యాయని గుర్తు చేశారు.

2008-09 ఆర్థిక సంక్షోభం కంటే ఇది పెను ప్రమాదమని హెచ్చరించారు. నాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 0.06 శాతం తగ్గిందని, కానీ ఆ సమయంలో భారత్, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు వేగంగా పుంజుకున్నాయన్నారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఉందన్నారు.
కరోనా మారణహోమానికి కారణమవుతోందని, ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 1.5 శాతం మేర పడిపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని దేశాలు కలిసి ముందుకు సాగాల్సిన తరుణమిది అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు, తక్కువ ఆదాయం కలిగిన దేశాలకు ఇది సవాల్ అన్నారు. ఈ పరిస్థితుల్లో అదనపు ఫైనాన్షియల్ సపోర్ట్, రుణ రిలీఫ్ అవసరమన్నారు.
ఈ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి పెట్టుబడిదారులు ఇప్పటికే 83 బిలియన్ డాలర్లను మార్కెట్ల నుండి వెనక్కి తీసుకున్నారన్నారు. దాదాపు 80 దేశాలు ఈ సమయంలో ఐఎంఎఫ్ నుండి ఎమర్జెన్సీ సహకారం కోరుతున్నాయని చెప్పారు.


Click it and Unblock the Notifications