ఈ-స్కూటర్ ప్రయాణ ఖర్చు కి.మీ.కు 30 పైసలే, ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 116 కి.మీ. వెళ్లవచ్చు
IIT హైదరాబాద్కు చెందిన స్టార్టప్ ప్యూర్ఈవీ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకు వస్తోంది. ఐఐటీ హైదరాబాద్ - ప్యూర్ ఈవీ సంయుక్తంగా ఈ స్కూటర్ను దేశీయ మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 116 కిలో మీటర్ల దూరం ఇది ప్రయాణిస్తుంది. సరసమైన ధరల్లో ఈ వాహనం లభిస్తుంది.
గుడ్న్యూస్: ఆధార్ కార్డుతో వెంటనే పాన్ కార్డ్ తీసుకోవచ్చు!
ఈ వాహనం పేరు... ఈ-ఫ్లూటో 7జీ
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనానికి ఈ-ఫ్లూటో 7Gగా నామకరణం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ ప్రాంగణం పక్కనే ఈ సంస్థ ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటు చేశారు. నెలకు 2వేల ఎలక్ట్రిక్ వెహికిల్స్ను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో నిర్మించారు.
కిలో మీటర్ ప్రయాణ ఖర్చు 30 పైసలు
ఈ నెల 9వ తేదీన నీతి అయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సారస్వత్, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెకక్రటరీ జయేష్ రంజన్లు ఈ స్కూటర్ను మార్కెట్లోకు విడుదల చేస్తారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 116 కి.మీ. ప్రయాణించవచ్చు. ప్రయాణ ఖర్చు కూడా కి.మీ.కు 25 నుంచి 30 పైసలు మాత్రమే.
రెండు వేరియంట్లలో వెహికిల్స్
ఈప్లూటో, ఈప్లూటో 7G అనే రెండు వేరియంట్లలో ఈ ఎలక్ట్రానిక్ వెహికిల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ప్యూర్ ఈవీ బ్యాటరీల తయారీ సంస్థ. కానీ ఐఐటీ హైదరాబాద్ సహకారంతో రూ.350 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్ స్కూటర్ను తయారు చేసింది.
డిమాండు ఆధారంగా ఉత్పత్తి
దేశంలోని మధ్యతరగతి వినియోగదారులు లక్ష్యంగా అందుబాటు ధరకే వీటిని అందించాలని భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 2 వేల స్కూటర్ల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేశారు. డిమాండును బట్టి ఉత్పత్తి పెంచేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఎక్స్షోరూం ధరను కూడా ఈ నెల 9న జరిగే ప్రారంభ కార్యక్రమంలో ప్రకటిస్తారు. ధరలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.