వరుసగా రెండో నెల: దారుణంగా పతనమైన పారిశ్రామికోత్పత్తి
ఫిబ్రవరి 2021లో దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (IIP) 3.6 శాతం క్షీణించింది. తయారీ రంగంలో 3.7 శాతం, మైనింగ్లో 5.5 శాతం చొప్పున ఉత్పత్తి తగ్గినట్లు NSO డేటా వెల్లడిస్తోంది. అయితే విద్యుత్ రంగంలో ఉత్పత్తి 0.1 శాతం పెరిగింది. గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఐఐపీ 5.2 శాతం వృద్ధి చెందడం గమనార్హం. మొత్తంగా 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య కాలంలో ఐఐపీ 11.3 శాతం క్షీణించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఐఐపీ 1 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఫిబ్రవరిలో పడిపోవడంతో వరుసగా రెండో నెలలోను పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. అంతకుముందు నెలలో 1.6 శాతం పతనమైంది. 2020 ఫిబ్రవరి నెలలో మాత్రం 4.5 శాతం వృద్థిని సాధించింది. ప్రభుత్వ ఆర్థిక విధానాలు ప్రజల కొనుగోలు శక్తిని హరించేలా చేయడంతో పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిందనేది నిపుణుల మాట.
జీఎస్టీ వల్ల పన్ను రేట్లు పెరగడం, గత ఏడాది కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు లాక్డౌన్ ప్రకటించడం వంటి వివిధ కారణాలతో ఉద్యోగాలు పోవడం, ఉపాధి కోల్పోవడం జరిగింది. ఇవి పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం చూపాయని అంటున్నారు.