2022-23కు భారత జీడీపీ వృద్ధి రేటును తగ్గించిన ఇక్రా
ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 8 శాతం నుండి 7.2 శాతానికి తగ్గించింది. రష్యా-ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో చమురు ధరలు పెరగడం, సరఫరా గొలుసుపై ప్రభావం పడటం వంటి అంశాలు ఉన్నాయని, చమురు, ఎడిబుల్ ఆయిల్స్ ధరలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను తగ్గించినట్లు తెలిపింది.
ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం భారత జీడీపీపై పడుతుందని ఇక్రా హెచ్చరించింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతానికి పరిమితమవుతుందని మంగళవారం పేర్కొంది. గత అంచనాల నుండి ఈ రేటులో 0.8 శాతం మేర కోత విధించింది. యుద్ధ ప్రభావంతో కమోడిటీ ధరలు పెరగడం, సరఫరా సమస్యలు తలెత్తడం వంటి అంశాల కారణంగా వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్టు ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ తెలిపారు.
వచ్చే ఏప్రిల్ నెల తొలినాళ్లలో జరిగే ఆర్బీఐ తదుపరి సమీక్షా సమావేశంలో గతంలో అంచనా వేసిన వృద్ధి రేటును సవరించే అవకాశముంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పర్యాటక ప్రాంతాలకు దూరంగా ఉన్న అధిక ఆదాయ వర్గాలు ఇక నుండి టూరిజం స్థలాలను సందర్శించే అవకాశముందని పేర్కొంది.