బెంగళూరు కంటే హైదరాబాద్ భేష్! ఇళ్ల ధరల్లో పెరుగుదల ఎంత, ఎందుకు?
ఆఫీస్ లీజుకు సంబంధించి దేశంలోనే భాగ్యనగరం అగ్రస్థానానికి చేరుకుంది. 2019లో జూలై - డిసెంబర్ మధ్య కాలంలో 89 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కార్యాలయాలు ఏర్పాటు అయ్యాయి. ఐటీ కార్యాలయాలు 41 శాతం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా 18 శాతం, కో వర్కింగ్ స్పేస్ 12 శాతం కార్యాలయాలను లీజుకు తీసుకున్నాయి. అదే సమంయలో ఇతర నగరాలతో పోలిస్తే నివాస గృహాల ధరలు హైదరాబాదులో ఆమోదయోగ్యంగా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో అంత ఆమోదయోగ్య స్థాయిలో లేవు.
చైనా కంపెనీలతో పోటీలో వెనక్కి, శాంసంగ్లో ఉద్యోగాల కోత?
అన్నింటా హైదరాబాద్ ఫస్ట్
ఆఫీస్ స్పేస్ విషయంలో హైదరాబాద్ తొలి స్థానంలో ఉంటే, బెంగళూరు 70 లక్షల చదరపు అడుగులతో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఏడాది మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటే బెంగళూరు 1.53 కోట్ల చదరపు అడుగులతో మొదటి స్థానంలో, 1.28 కోట్ల చదరపు అడుగులతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది రెండింతలు. ఈ మేరకు నైట్ ఫ్రాంక్ ఇండియా 2019 ద్వితీయార్థంలో స్థిరాస్థి నివేదిక వెల్లడించింది. కార్యాలయాల లీజ్, గృహ నిర్మాణ కొత్త ప్రాజెక్టుల ప్రారంభం, ఇళ్ల విక్రయాలు అన్నింట్లోను హైదరాబాద్ ఆశాజనకంగా కనిపించినట్లు తెలిపింది.
బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా...
దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో కలిపి గత ఏడాది 2.23 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులను ప్రారంభించారు. 2018తో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ. ద్వితీయార్థంలో చేపట్టిన 1.12 లక్షల ఇళ్లలో రూ.50 లక్షల లోపు వాటా దాదాపు 61 శాతం. ద్వితియార్థంలో ఇళ్లు, ప్లాట్ల విక్రయాల పరంగా బెంగళూరు 10 శాతం వృద్ధితో ఉండగా, హైదరాబాద్, కోల్కతా 9 శాతంతో ఉన్నాయి.
హైదరాబాద్లో 10 శాతం పెరుగుదల
వివిధ కారణాల వల్ల హైదరాబాదులో ఇళ్ల ధరలు పది శాతం పెరిగినట్లు ఈ నివేదిక తెలిపింది. 2018తో పోలిస్తే 2019లో చదరపు అడుగు సగటు ధర 10 శాతం పెరిగి రూ.4,090 నుంచి రూ.4,500కు చేరుకుంది. స్థలం ధరలు పెరగడం, నిర్మాణంలో వేగం, నిర్మాణ విధానంలో మార్పులు తదితర కారణాల వల్ల గృహాల ధరలు పెరిగాయని తెలిపింది. ఇళ్ల ధరలు హైదరాబాదులో 10 శాతం పెరగగా, బెంగళూరులో 6.3 శాతం, ఢిల్లీలో 4.5 శాతం, కోల్కతాలో 3.1 శాతం, అహ్మదాబాదులో 2 శాతం పెరిగాయి.
ఆ ధరలోని ఇళ్లకు డిమాండ్ పెరిగింది
హైదరాబాదులో రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ఉన్న ఇళ్లకు ఎక్కువ డిమాండ్ కనిపించిందని నివేదిక పేర్కొంది. మేనేజ్మెంట్ స్థాయి మధ్య, ఉన్నతస్థాయి అధికారులు స్థిరనివాసం వైపు చూస్తున్నారు. దీంతో రూ.1 కోటి నుంచి కోటిన్నర ధరల శ్రేణి ఇళ్లకు కూడా డిమాండ్ పెరిగింది.
వీటి వల్లే డిమాండ్
సాఫ్టువేర్ నిపుణులు, నైపుణ్యాల లభ్యత, కో-లివింగ్, కో వర్కింగ్ సంస్కృతి విస్తరణ, అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటంతో ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. అవసరమైన భూమి, ఇతర నగరాలతో పోలిస్తే తక్కువ ధర, రవాణా సదుపాయాలు పెద్ద కంపెనీలను ఆకర్షించాయి. దీంతో ఆఫీస్ స్థలంతో పాటు ఇంటి స్థలానికి కూడా డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగుంటుందని చెబుతున్నారు. ఐటీ పరిశ్రమ అండతో హైదరాబాదులో ఆఫీస్ స్పేస్కు, రియల్ ఎస్టేట్కు మంచి డిమాండ్ పెరుగుతోందని చెబుతున్నారు.