హైదరాబాద్ స్టార్టప్: ఈ-ట్రాక్టర్తో రైతుకు గంటకు రూ.100కు పైగా ఆదా, ఖరీదు రూ.5 లక్షలు
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సెల్లెస్టియల్ ఈ మొబిలిటీ బుధవారం సరికొత్త ఈ-ట్రాక్టర్ను లాంచ్ చేసింది. దీని ఖరీదు కూడా అందుబాటులో ఉందని కంపెనీ చెబుతోంది. దీని పనితీరు కూడా డీజిల్ పవర్డ్ ట్రాక్టర్ కంటే నాలుగు రెట్లు ఉంటుందట. తాము తీసుకు వచ్చిన ఈ-ట్రాక్టర్ పర్యావరణహితమైనదని సెల్లెస్టియల్ ఈ మొబిలిటీ కో-ఫౌండర్ సిద్ధార్థ దురైరాజన్ వెల్లడించారు.
రుణాలు తీసుకునే వారికి SBI గుడ్న్యూస్, వడ్డీ రేటు తగ్గింపు
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే..
తాజా ఆవిష్కరణతో దేశంలోకి విద్యుత్తో నడిచే ట్రాక్టర్లు వచ్చాయి. ఈ ట్రాక్టర్ 6 HP(21HP డీజిల్ ట్రాక్టర్కు సమానం) శక్తిని ఇస్తుందని, సింగిల్ చార్జింగ్తో 75 కి.మీ. దూరం ప్రయాణించవచ్చునని, ఈ ట్రాక్టర్ గంటకు 20 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని సిద్దార్థ దురైరాజన్ తెలిపారు. ఈ ట్రాక్టర్ వినియోగించిన వారికి సరాసరిగా గంటకు రూ.20 నుంచి 35 మేర ఖర్చు కానుందన్నారు.
మూడేళ్లలో 8వేల ట్రాక్టర్లు
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే నాలుగైదు గంటలు పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 150 ఏహెచ్. పుల్లింగ్ సామర్థ్యం 1.2 టన్నులు. నెలకు 100 ట్రాక్టర్ల తయారీ సామర్థ్యం ఉన్న ప్లాంట్ ఉందని చెప్పారు. వచ్చే మూడేళ్లలో 8,000 ట్రాక్టర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
గంటకు రూ.35 మాత్రమే
డీజిల్ ఇంజిన్ కలిగిన సాధారణ ట్రాక్టర్ ఒక గంట పని చేయడానికి (రన్నింగ్ కాస్ట్) దాదాపు రూ.150 ఖర్చు అవుతుంది. ఈ-ట్రాక్టర్కు దాదాపు రూ.20-35 మాత్రమే ఉంటుందని కంపెనీ చెబుతోంది. అంటే ఖర్చులు రూ.100కు పైగా తగ్గుతున్నాయి. ఇంజినీరింగ్ డిజైన్, అడ్వాన్స్డ్ బ్యాటరీ టెక్నాలజీ, కాస్టింగ్, ఫ్యాబ్రికేషన్, ట్రాక్టర్ తయారీ, మార్కెటింగ్లో అనుభవం ఉన్న నలుగురు భాగస్వాములు కలిసి దీనిని అభివృద్ధి చేశారు.
ట్రాక్టర్ ఖరీదు రూ.5 లక్షలు
హైదరాబాద్ బాలానగర్ వద్ద ఏర్పాటు చేసిన అసెంబ్లింగ్ ప్లాంట్లో నెలకు 100 ట్రాక్టర్స్ తయారవుతున్నాయని, డిమాండ్ పెరిగితే వచ్చే మూడేళ్లలో కెపాసిటీ పెంచుతారు. ఈ ట్రాక్టర్ ధర రూ.5 లక్షలలోపు ఉంటుంది. ఏడాది క్రితం ఈ-మొబిలిటీ విభాగంలోకి అడుగు పెట్టింది ఈ సంస్థ. సింగపూర్ యాంజిల్ ఇన్వెస్టర్ల నుండి 2 లక్షల డాలర్లు సేకరించింది. రానున్న ఆరు నెలల్లో మరో 6-8 మిలియన్ డాలర్ల నిధులను సేకరించాలని భావిస్తోంది.