Cryptocurrency Ban In India: నిర్మలమ్మ ఏం చెప్పారంటే..?
ఢిల్లీ: భారత్లో క్రిప్టోకరెన్సీ పై నీలిమేఘాలు అలుముకున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో క్రిప్టోకరెన్సీ వాటాదారులకు ఒక్కింత ఊరట కలిగినట్లయ్యింది. డిజిటల్ కరెన్సీపై ఒక్కసారిగా నిషేధం విధించే ప్రయత్నం కేంద్రం చేయడం లేదని దీనిపై అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నామని చెప్పారు. అంతేకాదు కొత్త సాంకేతికతను లేదా టెక్నాలజీపై ప్రయోగాలు చేసేందుకు కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. దీంతో క్రిప్టోకరెన్సీపై నెలకొన్న కొన్ని అనుమానాలకు స్పష్టత వచ్చినట్లయ్యింది.
ఆర్బీఐతో చర్చలు జరుపుతున్నాం
క్రిప్టో కరెన్సీ వినియోగంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని చెప్పిన నిర్మలా సీతారామన్... అనధికారిక క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐని ఒక ప్రణాళిక తయారు చేయమని చెప్పినట్లు చెప్పారు. అంతేకాదు క్రిప్టోకరెన్సీని ఎలా నియంత్రణలో ఉంచాలో కూడా ప్లాన్ సిద్ధం చేయాల్సిందిగా కోరినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం క్రిప్టో ప్రపంచంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
టెక్నాలజీ వినియోగంలో కేంద్రం ఎప్పుడూ ముందే..
కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికతను వినియోగించడంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని అయితే ఒక లెక్క ప్రకారం అడుగులు ముందుకు వేస్తుందని నిర్మలమ్మ చెప్పారు. ఇక క్రిప్టో కరెన్సీ వినియోగంపై ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంకేతాలు వస్తున్నాయని చెప్పారు. ప్రపంచం టెక్నాలజీకి అనుగుణంగా వేగంగా అడుగులు ముందుకు వేస్తోందని, భారత్ మాత్రం ఎప్పుడూ వెనకపడి ఉండాలని కోరుకోదని వివరించారు.
శక్తికాంత దాస్ చెప్పిన కొద్ది రోజులకే
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కొద్ది రోజుల క్రితం క్రిప్టో కరెన్సీ లేదా డిజిటల్ కరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడంపై ఆర్బీఐ సమాలోచనలు చేస్తోందని ఇందులో భాగంగానే క్రిప్టోకరెన్సీపై కూడా ఆలోచన చేస్తోందని చెప్పారు. ఇప్పుడు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి కూడా ఇవే వ్యాఖ్యలు చేయడంతో భారత్లో డిజిటల్ కరెన్సీపై ఆశలు చిగురిస్తున్నాయి. అంతేకాదు క్రిప్టోకరెన్సీ వినియోగం కోసం ఒక బిల్లు ప్రవేశపెడతామంటూ ప్రభుత్వం పేర్కొంది. అయితే అంతకుముందు డిజిటల్ కరెన్సీ, బిట్కాయిన్ వినియోగంపై ఏర్పాటు చేసిన ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. బిట్కాయిన్ లాంటి ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై భారత్లో నిషేధం విధించాలంటూ నివేదికలో పొందుపర్చింది. అదే సమయలో ఆర్బీఐ నేతృత్వంలో లేదా నియంత్రణలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
2018లో ఆర్బీఐ క్రిప్టోకరెన్సీ వినియోగంపై నిషేధం విధించగా... 2019లో సుప్రీంకోర్టు క్రిప్టోకరెన్సీ వినియోగంపై ప్రభుత్వం విధివిధానాలను రూపొందించాలని ఆదేశించింది. డిజిటల్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ నిషేధంను ఎత్తివేస్తూ 2020లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.