45,000 కోట్ల పెట్టుబడులు, 50వేల ఉద్యోగాలు: ఇప్పుడు 'అమరావతి' పరిస్థితి ఏమిటి!?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం అమరావతిలో ఆందోళనలకు దారి తీసింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల ప్రజలు దాదాపు నెల రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలని, అవసరమైతే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని చెబుతున్నారు. జీఎన్ రావు కమిటీ, బీసీజీ కమిటీ, హైపవర్ కమిటీ కాదని, ప్రజల నిర్ణయం తీసుకోవాలని, తమ ఆందోళనలు అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. ఈ నిర్ణయంతో రాజధాని ప్రాంత రైతులు నష్టపోవడంతో పాటు పెట్టుబడులు వెనక్కి వెళ్లే పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
జనవరి 1 నుంచి అన్ని సేవలు గ్రామసచివాలయాల్లో: మినిమం ఛార్జ్
అందుకే 33వేల ఎకరాలు...
అమరావతి రాజధానిగా ఉంటుందని భావించి చాలామంది పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. గత ప్రభుత్వం నిర్మించిన అసెంబ్లీ, సచివాలయం వంటి పలు నిర్మాణాల నుంచే నేటి ప్రభుత్వం విధులు నిర్వర్తిస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే రాజధానికి 33వేల ఎకరాలు అవసరం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం అమరావతికి వివిధ సంస్థలు వచ్చాయని, కోర్ క్యాపిటల్ నిర్మాణానికి మాత్రమే ప్రభుత్వం సొంత నిధులు వెచ్చించి మిగతా భూమిని నగర నిర్మాణానికి, ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉపయోగపడిందని చెబుతున్నారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకే ఇంత భూమి సమీకరించారని చెబుతున్నారు.
వేలాది ఎకరాల భూకేటాయింపు
ఏపీకి ఏమేం వచ్చాయనే అంశంపై ప్రముఖ తెలుగు దిన పత్రికలో ఓ కథనం వచ్చింది. దీని ప్రకారం... అమరావతిలో అభివృద్ధిలో భాగమయ్యేందుకు వివిధ ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు ఆసక్తి చూపించడంతో చంద్రబాబు ప్రభుత్వం 1,660 ఎకరాల భూకేటాయింపులకు అనుమతి ఇచ్చింది. నికరంగా 130 సంస్థలకు 1,293 ఎకరాలను సీఆర్డీఏ కేటాయించింది.
45వేల కోట్ల పెట్టుబడులు, 50వేల మందికి ఉపాధి
ఇలా కేటాయింపులు జరిపిన వాటిలో కొన్ని సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించగా, మరిన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి ఆచరణలోకి వస్తే దాదాపు రూ.45వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా 50వేల మందికి ఉపాధి లభిస్తుంది.
భూకేటాయింపులతో సీఆర్డీఏకు ఆదాయం
భూకేటాయింపులు వివిధ ప్రాతిపదికన జరిగాయి. ఈ కేటాయింపులతో సీఆర్డీఏకు రూ.677 కోట్ల ఆదాయం వచ్చింది. మరో రూ.546 కోట్ల బకాయిలు రావాలి. కొన్ని సంస్థలకు పూర్తిగా, మరిన్ని సంస్థలకు 30 ఏళ్ల నుంచి 99 ఏళ్ల ప్రాతిపదికన కేటాయింపులు జరిపారు.
విద్యారంగంలో...
విద్యా రంగంలో విట్, ఎస్ఆర్ఎం, అమృత విశ్వవిద్యాలయం, ఎక్స్ఎల్ఆర్ఐ సంస్థలకు కేటాయింపులు జరిగాయి. వీటిలో కొన్ని సంస్థలు తొలి దశ నిర్మాణం పూర్తిచేయగా, రెండేళ్లుగా క్లాసెస్ నడుస్తున్నాయి. కొన్ని సంస్థలు నిర్మాణ దశలో, మరిన్ని సంస్థలు శంకుస్థాపన పూర్తి చేసుకున్నాయి.
వేలాది మందికి ఉపాధి, లక్షలాది మందికి చదువు
విట్ ద్వారా 6వేల మందికి, ఎస్ఆర్ఎం ద్వారా 6వేల మందికి (ప్రత్యక్ష ఉపాధి), అమృత నిర్మాణం పూర్తయితే 4వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ సంస్థల్లో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటారు.
హెల్త్ కేర్
హెల్త్ కేర్ రంగం విషయానికి వస్తే ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వంటి సంస్థలకు భూములు కేటాయించారు.
ఆతిథ్య రంగం
ఆతిథ్య రంగంలో వివాంటా, వెస్టిన్, హిల్టన్, నోవాటెల్ వంటి హోటళ్ళకు భూ కేటాయింపులు జరిపారు. పీపీపీ విధానంలోను మరిన్ని ప్రాజెక్టులకు స్థలాలు కేటాయించింది. ఈ పెట్టుబడుల ద్వారా కూడా వేలాది ఉద్యోగాలు లభించేవని చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలు
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నింటికి ఒకేచోట భూకేటాయింపు జరిగింది. బ్యాంకులు, ఆయిల్ కంపెనీలకు భూకేటాయింపులు జరిపారు. మొత్తం 25 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 197 ఎకరాలు, 18 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు 23 ఎకరాలు కేటాయించింది. ఎన్ఐడీ, సీఐటీడీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఆర్బీఐ, కాగ్, సీబీఐ, ఇగ్నో, ఐఎండీ, విదేశాంగ శాఖకు భవనం, సివిల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్, నేషనల్ బయో డైవర్సిటీ మ్యూజియం తదితర సంస్థలకు ఇచ్చారు.
వీటితో 5వేల మంది ఉద్యోగుల రాక
నాబార్డ్, ఎల్ఐసీ, ఎఫ్సీఐ, ఎస్బీఐ సహా ఎన్నో బ్యాంకులు, పెట్రోలియం, బీమా కంపెనీలకు భూమిని కేటాయించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు ఉచితంగా, తక్కువ ధర నుంచి రూ.4 కోట్ల వరకు ధరతో ఇచ్చారు. ఇవన్నీ ఏర్పాటయితే అమరావతికి ఐదువేల మంది ఉద్యోగులు వస్తారని అంచనా.
హ్యాపీ నెస్ట్
నేలపాడులో హ్యాపీనెస్ట్ పేరుతో 1,200 ప్లాట్ల నిర్మాణం తలపెట్టి, ఆన్ లైన్ ద్వారా బుకింగ్ నిర్వహిస్తే పెద్ద మొత్తంలో సేల్ అయ్యాయి. ఎన్నారైల కోసం ఐకాన్ టవర్ ప్రాజెక్టును చేపట్టారు. ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున ఐదు ఎకరాలు కేటాయించారు. ఇందులో ప్లాట్ల బుకింగ్కు కూడా వేలాది మంది పోటీ పడ్డారు.
ఎవరికి ఎన్ని ఎకరాలు అంటే..
అమరావతిలో 4 హోటళ్లకు 400 ఎకరాలు, 11 స్కూళ్లకు 42 ఎకరాలు, 4 హాస్పిటల్స్కు 177 ఎకరాలు, 2 క్రీడా సంస్థలకు 24 ఎకరాలు, 1 రిసార్టుకు 3.5 ఎకరాలు, 2 కన్వెన్షన్ సెంటర్లకు 47 ఎకరాలు, 5 ఆధ్యాత్మిక, మత సంస్థలకు 57.50 ఎకరాలు, 25 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 197 ఎకరాలు, 24 రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు 165 ఎకరాలు, 18 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు 23 ఎకరాలు, 4 రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు 11 ఎకరాలు, ఐఏఎస్ క్వార్టర్స్ కోసం 38 ఎకరాలు, జడ్జిలు, రిజిస్ట్రార్ జనరల్, రిజిస్ట్రార్ క్వార్టర్లకు దాదాపు 2 ఎకరాలు కేటాయించారు. మొత్తంగా 130 సంస్థలకు దాదాపు 1,300 ఎకరాలు కేటాయించారు. ధర లక్షల నుంచి రూ.కోట్లలో ఉంది. కొన్నింటిలో వాటా, కొన్నింటికి ఉచితంగా, మరికొన్నింటికి తక్కువ ధరకు ఇచ్చారు.
ఇప్పుడు వీటి పరిస్థితి ఏమిటి?
రాజధానిగా భావించి అమరావతికి వందలాది సంస్థలు వచ్చాయని, కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేశాయని, చేస్తున్నాయని ఇప్పుడు వీటి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నే అని చెబుతున్నారు.