Financial Crisis: మాంద్యం ముంగిట ప్రపంచం.. భారత్ కు ప్రమాదం ఎంత శాతం..? 86% నిపుణుల మాటిదే..
Global Financial Crisis: కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన అంతరాయాలు, ఉక్రెయిన్పై రష్యా దాడి, చాలా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణం రేట్లు కారణంగా ఇప్పటికే పదునైన ప్రపంచ ఆర్థిక మందగమనం ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారిపోయే సంభావ్యత పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇవి ఇప్పుడు ప్రజల మనసులో గుబులు పుట్టిస్తున్నాయి.
ఈ కారణాల వల్లే మాంద్యం..
ప్రపంచ వ్యాప్తంగా విఘాతం కలిగించే స్థూల ఆర్థిక, భౌగోళిక, రాజకీయ వాతావరణం కారణంగా చాలా దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువ ప్రమాదం ఈ దేశాలకే..
అధిక ద్రవ్యోల్బణం రేటు కారణంగా యునైటెడ్ స్టేట్స్ మాంద్యం ఎదుర్కొనే అవకాశం 40% ఉంది. అయితే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఐరోపాకు 55%, ఆసియాలో 20-25%, శ్రీలంకలో 85% మాంద్యం ప్రమాద అంచున ఉన్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.
చైనా పరిస్థితి ఏమిటి..?
చైనా, తైవాన్, ఆస్ట్రేలియాలో మాంద్యం సంభవించే అవకాశం 20% ఉందని తెలుస్తోంది. ఈ ప్రమాదం న్యూజిలాండ్ కు 33%, దక్షిణ కొరియా & జపాన్లకు 25% ఉందని వెల్లడైంది. టాప్- 19 గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్ల్లో 11 ద్రవ్యోల్బణం వచ్చే ఏడాది లక్ష్యానికి చేరుకుంటాయని ఆర్థికవేత్తల రాయిటర్స్ పోల్ ప్రకారం వెల్లడైంది.
భారత్ పరిస్థితి ఇలా..
ప్రపంచంలోని ఇతర దేశాలు తీవ్రమైన ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్నప్పటికీ, వచ్చే సంవత్సరంలో భారతదేశం మాంద్యంలోకి జారిపోయే అవకాశం "సున్నా శాతం" ఉందని ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నారు. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి రికార్డు స్థాయిలో కనిష్ఠ స్థాయికి పడిపోయినప్పటికీ.. భారత్లో మాంద్యం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడైంది. భారతదేశంపై ప్రభావం ఉన్నప్పటికీ.. అది "మితమైన, స్వల్పకాలికమైనది" అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
86% ఆర్థిక వేత్తలు ఏమంటున్నారంటే..
అమెరికాకు చెందిన ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పోరాటం కొనసాగిస్తున్నాయి. ప్రపంచ వృద్ధి ఈ ఏడాది 3.0%కి తగ్గుతుందని.. ఆ తర్వాత 2.8%కి తగ్గుతుందని గణాంకాలు చెబుతున్నాయి. 86% మంది ఆర్థికవేత్తల ప్రకారం.. సంక్షోభం వచ్చే ఏడాది నాటికి గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అయితే.. 39% మంది మాత్రం పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు.