ఆకాశం నుండి పాతాళానికి యస్ బ్యాంక్, ఐనా షేర్లు ఎందుకు పెరిగాయి: SBI కొనుగోలు చేస్తే..?
ముంబై: యస్ బ్యాంకు షేర్లు గురువారం పరుగులు పెట్టాయి. బీఎస్ఈలో 25.77 శాతం (రూ.7.55) దూసుకెళ్లి రూ.36.85 వద్ద ముగిశాయి. ఓ దశలో రూ.37.90 వద్ద గరిష్టస్థాయికి చేరుకుంది. NSEలో ఈ షేర్ రూ.25.6 శాతం (రూ.7.50 లాభంతో రూ.36.80 వద్ద స్థిరపడింది. ఆర్బీఐ సాయంత్రం యస్ బ్యాంకుపై మారటోరియం విధించింది. నగదు ఉపసంహరణ పరిమితిని నెలకు రూ.50వేలు చేసింది. డిపాజిటర్లపై పలు ఆంక్షలు విధించింది. అయితే గురువారం యస్ బ్యాంకు షేర్ 26 శాతం పెరగడం అసంబద్ద చర్యగానే భావించాలని బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్ తెలిపింది.

నాడు ఎంతో ఇష్టమైనది..
ఇదివరకు ఇన్వెస్టర్లకు యస్ బ్యాంకు ఎంతో ఇష్టమైనది. జనవరి 31, 2019 వరకు బ్యాంకును వీడాలని నాటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాణా కపూర్కు ఆగస్ట్ 2018న ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి.
గత మార్చిలో కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ రవ్నీత్ గిల్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కష్టాలు తప్పలేదు.

భారీ ఒత్తిడి..
రుణ పుస్తకంపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలని యస్ బ్యాంకు భావించింది. అయితే కెనడా ఇన్వెస్టర్ SPGP గ్రూప్, ఎర్విన్సింగ్ బ్రెయిన్ బ్యాంకులో 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు బ్యాంకు బోర్డు తిరస్కరించింది.

తగ్గిన మూలధన నిల్వలు
2019 డిసెంబర్లో సంక్షోభం కారణంగా క్వార్టర్ ఫలితాలను వాయిదా వేసింది. రూ.400 గరిష్టస్థాయికి చేరుకున్న షేర్ 80 శాతం క్షీణించింది. ఎల్పీఏల కారణంగా బ్యాంకు మూలధన నిల్వలు కూడా తగ్గిపోయాయి. మార్చి 2019 క్వార్టర్ నాటికి నష్టాలను ప్రకటించింది.

ఒకేరోజు 30 శాతం పతనం
2018 జూన్ 12న యస్ బ్యాంకు ఎండీ, సీఈఓగా మూడేళ్లపాటు రాణా కపూర్ పునర్నియామకానికి వాటాదారులు ఆమోదించారు. కానీ ఆర్బీఐ జనవరి 31, 2019 వరకే తగ్గించింది. దీంతో 2018 ఆగస్ట్ - సెప్టెంబర్ నెలల్లోనే యస్ బ్యాంకు షేర్లు పతనమయ్యాయి. ఒకేరోజు 30 శాతం పతనమయ్యాయి. రూ.21,951 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఆవిరయింది.

వరుస రాజీనామాలు
ప్రమోటర్ల షేర్లను విక్రయించనని, కూతుళ్లకు ఇస్తానని రాణా కపూర్ సెప్టెంబర్ నెలలో ప్రకటించారు. 2018 నవంబర్ 14న చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రిజైన్ చేశారు. ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి నుండి వసంత్ గుజరాతీ వైదొలిగారు. నవంబర్ 19, 2018న మరో ఇండిపెండెంట్ డైరెక్టర్ రెంటాల చంద్రశేఖర్ రాజీనామా చేశారు. 2018 నవంబర్ 27న యస్ బ్యాంకు రేటింగ్ను మూడిస్ తగ్గించింది.

షేర్లు పతనం
మార్చి 1, 2019న రవన్నీత్ గిల్ సీఈవో, ఎండీగా బాధ్యతలు స్వీకరించాక షేర్లు లాభాల్లోకి వచ్చాయి. మార్చి 5న స్విఫ్ట్ కార్యకలాపాల నిబంధనలు పాటించనందుకు రూ.1 కోటి జరిమానా విధించింది ఆర్బీఐ. 2018-19 క్వార్టర్ ఫోర్ ఫలితాల్లో నష్టాలు వచ్చాయి. మాక్వైరీ బ్రోకరేజీ సంస్థ యస్ బ్యాంకు రేటింగ్ను తగ్గించింది. వరుస పరిణామాలతో ఏప్రిల్ 30, 2019న షేర్లు 30 శాతం పతనమయ్యాయి.

తనఖా పెట్టారని తెలియడంతో..
మే 15, 2019న యస్ బ్యాంకు డైరెక్టర్ల బోర్డులో అదనపు డైరెక్టర్ ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీని నియమించారు. జూలై 18, 2019న రాణాకపూర్ తన షేర్లను తనఖా పెట్టారని వార్తలు రావడంతో షేర్లు పతనమయ్యాయి.

వాటాల విక్రయం
ఆగస్ట్ 10, 2019న సీఎఫ్ఓగా అనురాగ్ నియమించబడ్డారు. సెప్టెంబర్ 21, 2019న రాణాకపూర్ 2.75 శాతం వాటాలు విక్రయించారు. దీంతో అతని వాటా 6.89 శాతానికి తగ్గింది.

నెగిటివ్ అవుట్ లుక్
యస్ బ్యాంకు గ్రూప్ ప్రెసిడెంట్ రజత్ మోంగా అక్టోబర్ 3, 2019న రాజీనామా చేశారు. నవంబర్ 1, 2019న సెప్టెంబర్ క్వార్టర్లో రూ.600 కోట్లు నష్టం వచ్చింది. గత డిసెంబర్ 6న మూడీస్ నెగిటివ్ అవుట్ లుక్ ఇచ్చింది. దీంతో షేర్లు దాదాపు పది శాతం పతనమయ్యాయి. డిసెంబర్ 17న కొటక్ మహీంద్రాలో విలీనం అవుతుందనే ప్రచారం సాగింది.

ఎస్బీఐ కొనుగోలు చేస్తే...
ఈ ఏడాది జనవరి 10న కార్పోరేట్ గవర్నెన్స్ సరిగా లేదని బోర్డు మెంటార్ ఉత్తమ్ ప్రకాశ్ తప్పుకున్నారు. జనవరి 13న ఇన్సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందని, సెబి దర్యాఫ్తు చేయాలని కూడా ఆయన లేఖ రాశారు. దీంతో షేర్లు భారీగా పతనమయ్యాయి. మార్చి 5న ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం యస్ బ్యాంకు షేర్ల వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉందని వార్తలు వచ్చాయి. దీంతో షేర్ ధర 26 శాతం ఎగిసింది. అయితే ఆ తర్వాత ఆర్బీఐ మారటోరియం విధించింది. అయితే ఎస్బీఐ కొనుగోలు చేసే వార్తలు నిజమైతే మాత్రం సగటు ఇన్వెస్టర్ సంతోషంచ దగ్గ విషయంగా చెబుతున్నారు. అంతేకాదు, షేర్లు కూడా లాభాల్లోకి దూసుకెళ్తాయని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications