హౌసింగ్ సేల్స్ 71% జంప్, హైదరాబాద్లో మూడు రెట్లు అధికం
దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో 2021 సంవత్సరంలో హౌసింగ్ సేల్స్ 71 శాతం పెరిగాయి. అయినప్పటికీ కరోనా ముందుస్థాయి కంటే 10 శాతం తక్కువగా ఉన్నాయి. గత క్యాలెండర్ ఏడాదిలో దేశవ్యాప్తంగా 2,36,530 ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. ఈ మేరకు అనరాక్ నివేదిక వెల్లడించింది. 2020 క్యాలెండర్ ఏడాదిలో హౌసింగ్ సేల్స్ 1,38,350 యూనిట్లు కాగా, 2019లో 2,61,358గా ఉన్నాయి. కరోనా సమయంలో వడ్డీ రేట్లు భారీగా తగ్గిపోవడం, దీనికి తోడు ఆర్థిక రికవరీ కనిపించడం, బిల్డర్స్ ఇస్తున్న డిస్కౌంట్లు లేదా తగ్గింపు వంటి వివిధ అంశాలు హౌసింగ్ సేల్స్ పెరగడానికి దోహదపడ్డాయని ముంబైకి చెందిన అనరాక్ తెలిపింది. మహారాష్ట్రలో స్టాంప్ డ్యూటీ వంటి అంశాలు మరింత దోహదపడ్డాయని తెలిపింది.
హైదరాబాద్లో మూడింతల వృద్ధి
2021 క్యాలెండర్ ఏడాదిలో నాలుగో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో హౌసింగ్ సేల్స్ రికార్డ్ స్థాయిలో 39 శాతంగా నమోదయినట్లు తెలిపింది. పండుగ సమయానికి తోడు, ఇతర అంశాలు కలిసి వచ్చాయని తెలిపింది. అనరాక్ హౌసింగ్ సేల్స్ ప్రకారం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) ప్రాంతంలో 72 శాతం ఎగిసి 76,400కు చేరుకున్నాయని తెలిపింది. హైదరాబాద్లో అయితే సేల్స్ మూడింతలు పెరిగాయి. గత ఏడాది దేశంలోని మరే ప్రధాన నగరంలోను ఇళ్ల అమ్మకాల్లో ఇంత భారీ వృద్ధి రేటు కనిపించలేదు. మరే నగరంలో లేని విధంగా 2021లో హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు 3 శాతం నుండి 5 శాతం పెరిగాయి.
వివిధ నగరాల్లో ఇలా..
హైదరాబాద్లో ఇళ్ల విక్రయాలు 2020లో 8,560 కాగా, 2021లో 25,410 నమోదయ్యాయి. మూడింతలు పెరిగాయి.
ఢిల్లీ-NCRలో ఇళ్ల విక్రయాలు 2020లో 23,210 కాగా, 2021లో 40,050 నమోదయ్యాయి.
పుణేలో ఇళ్ల విక్రయాలు 2020లో 23,460 కాగా, 2021లో 35,980 నమోదయ్యాయి.
బెంగళూరులో ఇళ్ల విక్రయాలు 2020లో 24,910 కాగా, 2021లో 33,080 నమోదయ్యాయి.
చెన్నైలో ఇళ్ల విక్రయాలు 2020లో 6,740 కాగా, 2021లో 12,530 నమోదయ్యాయి.
కోల్కతాలో ఇళ్ల విక్రయాలు 2020లో 7,150 కాగా, 2021లో 13,080 నమోదయ్యాయి.
ముంబైలో ఇళ్ల విక్రయాలు 72 శాతం పెరిగి 2021లో 76,400కు చేరుకున్నాయి.
2022 బాగుంటుంది
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో పండుగ సీజన్ నేపథ్యం 39 శాతం సేల్స్ కనిపించాయి. కొత్త ఇళ్ల నిర్మాణం 2021లో 2019నాటి స్థాయికి (2,36,700) చేరుకున్నాయి. 2020లో ఇది 1,28,000. 2022లో హౌసింగ్ సేల్స్లో పురోగతి బాగుంటుందని, ముడి పదార్థాల ధరల వల్ల, ఇళ్ల ధరలు ఈ ఏడాది 5 శాతం నుండి 8 శాతం పెరగవచ్చునని అనరాక్ ఛైర్మన్ అనుజ్ పురి తెలిపారు.