దక్షిణాదిన రియాల్టీ అదుర్స్, హైదరాబాద్లో ఇళ్ల ధరలు జంప్
కరోనా మహమ్మారి కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో రియాల్టీ రంగం దారుణంగా పడిపోయింది. అయితే దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో డిసెంబర్ త్రైమాసికంలో మాత్రం పుంజుకుంది. దక్షిణాది హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో డిమాండ్ వేగంగా పుంజుకుంటోందని రియల్ ఎస్టేట్ సంస్థ ప్రాప్టైగర్ తెలిపింది. విక్రయాలతో పాటు, కొత్త ప్రారంభాలు కూడా అక్టోబర్ - డిసెంబర్ 2020 కాలంలో పెరిగినట్లు తెలిపింది.
ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, వడ్డీరేటుపై రాయితీ: హోంలోన్ తీసుకుంటున్నారా, ఎస్బీఐ గుడ్న్యూస్
ఇళ్లు, స్థలాల కొనుగోలుపై ఆసక్తి
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ మైనస్ 23.9 శాతంగా నమోదు కాగా, రెండో క్వార్టర్లో మైనస్ 7.5 శాతంగా నమోదయిన విషయం తెలిసిందే. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో రియాల్టీ కూడా కాస్త సానుకూలంగా ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో జీఎస్టీ కలెక్షన్లు కూడా రూ.1 లక్ష కోట్లు దాటుతున్నాయి. కార్యకలాపాలు వేగవంతం కావడానికి తోడు, కరోనా నేపథ్యంలో చాలామంది బంగారం, ఇళ్లు, స్థలాలపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
హైదరాబాద్లో పెరుగుతున్న ధరలు
దీంతో అక్టోబర్-డిసెంబర్ 2020లో ఇళ్ల కొనుగోళ్లు, ప్రారంభాలు ఎక్కువగా కనిపించాయని ఈ నివేదిక తెలిపింది. దేశంలో ప్రారంభమైన కొత్త ప్రాజెక్టుల్లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లోనే 43% వరకు ఉన్నట్లు తెలిపింది. అమ్మకాలపరంగా 29% వరకు ఇక్కడే కనిపించాయి. మిగతా అన్ని నగరాల్లో ధరలు తగ్గుతుంటే హైదరాబాద్ నగరంలో మాత్రం ధరల్లో వృద్ధి ఉందని పేర్కొంది. ఇక్కడ మౌలిక వసతుల అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థల ప్రాజెక్టులు ఇందుకు కారణమని వెల్లడించింది.
హైదరాబాద్లోనే ఎక్కువ
అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో ఎక్కువ ప్రాజెక్టులు హైదరాబాద్లోనే ప్రారంభమయ్యాయని ఈ నివేదిక వెల్లడించింది. గత క్వార్టర్లో హైదరాబాద్ నగరంలో కొత్తగా 12,723 ఇళ్లు ప్రారంభం కాగా, 6,487 సేల్ అయ్యాయి. ఆఫీస్ కార్యకలాపాలపరంగా హైదరాబాద్ వెస్ట్లో సప్లై, డిమాండ్ ఎక్కువగా ఉంది. హైదరాబాద్ నగరంలో ఏడాదిలో 5% వరకు ధరలు పెరిగాయి.