ఉద్యోగాలు కాపాడేందుకు హాంగ్కాంగ్ కీలక నిర్ణయాలు, ప్రభుత్వ ఉద్యోగులకు 50% వేతనమే
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారాలు, కంపెనీలు, ఉత్పత్తులు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. దీంతో కంపెనీలకు ఆదాయం లేదు. కొత్త ఉద్యోగాలు లేవు. పైగా ఇప్పటికే ఉన్న ఉద్యోగులను తొలగించడం లేదా వేతనం కట్ చేయడం వంటి క్లిష్ట పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్, చైనా, అమెరికా వంటి దేశాలు ఉద్యోగాలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
ఆందోళన వద్దు.. మీ ఉద్యోగాలు మీకే, కానీ శాలరీ పెంపు మాత్రం లేదు!
17.7 బిలియన్ డాలర్ల ప్యాకేజీ
కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న వ్యాపార సంస్థలను, ప్రజలను ఆదుకునేందుకు హాంగ్కాంగ్ బుధవారం భారీ ప్యాకేజీని ప్రకటించింది. 137.7 బిలియన్ల హాంగ్కాంగ్ డాలర్లను ప్రకటించింది. అమెరికా కరెన్సీలో ఇది 17.7 బిలియన్ డాలర్లు.
6 నెలల పాటు 50% వేతనాలు మాత్రమే
అంతేకాదు, హాంగ్కాంగ్ నేత సహా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సగానికి తగ్గించారు. ఈ సిటీ నేత క్యారీ లామ్ తాను ఏడాది పాటు కేవలం 10 శాతం వేతనం మాత్రమే తీసుకుంటానని స్పష్టం చేశారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులకు కేవలం 50 శాతం వేతనాలు మాత్రమే ఇస్తామన్నారు. ఇది ఆరు నెలల పాటు కొనసాగుతుందని చెప్పారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వేతనం కూడా ఈ ఆరు నెలల పాటు HK$9,000 ఉంటుందని చెప్పారు.
ఉద్యోగులను తొలగించకండి
HK$80 బిలియన్ల వేతన పథకాన్ని కూడా ఆయన ప్రకటించారు. అలాగే, కరోనా నేపథ్యంలో ఉద్యోగులను తొలగించవద్దని ఆయన కంపెనీల యాజమాన్యాలను కోరారు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొందని చెప్పారు.
డబ్బులు వస్తాయి.. కంపెనీలకు ఏం చెబుతున్నానంటే..
ఇప్పుడు నా ప్రెస్ కాన్ఫరెన్స్ వింటున్న యజమానులకు లేదా రేపు పత్రికలు చదివే వారికి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానని, డబ్బులు వస్తాయని, ఉద్యోగులను మాత్రం తొలగించవద్దని విజ్ఞప్తి చేశారు. సిబ్బందిని తొలగించేందుకు తొందరపడవద్దని, వేచి చూడాలని, డబ్బులు వస్తాయన్నారు.
కరోనా వ్యాప్తి నిరోధానికి..
కరోనా కారణంగా ఆర్థిక ప్యాకేజీ ఈ సంవత్సరం బడ్జెట్ లోటు HK$139.1 బిలియన్ల నుండి HK$276.6 బిలియన్లకు చేరుకుంది. ఇది ఆ దేశ జీడీపీలో 9.5 శాతం. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఇక్కడి ప్రభుత్వం ఏప్రిల్ 23వ తేదీ వరకు బార్లు, పబ్బులు మూసివేసింది. నలుగురికి పైగా జతకూడదని స్పష్టం చేసింది. బహిరంగ సభలు నిషేధించింది. జిమ్లు, సినిమాలు, పార్లర్లు, కచేరీ లాంజ్లు, నైట్ క్లబ్స్ అన్నింటిని మూసివేశారు. అదే సమయంలో ప్యాకేజీని ప్రకటించింది.