హైదరాబాద్లో ఇళ్ల విక్రయాల్లో 21 శాతం వృద్ధి, అమ్ముడుపోనివి ఎక్కువే
కరోనా ఆందోళనలు తొలగిపోయి ఆర్థిక స్థిరత్వంపై భరోసా ఏర్పడటంతో ఈ ఏడాది రెండో క్వార్టర్లో (ఏప్రిల్-జూన్) దేశవ్యాప్తంగా ఇళ్ల విక్రయాలు పెరిగాయి. ఈ మేరకు ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్, అహ్మదాబాద్లలో అత్యధిక వృద్ధి నమోదయింది. ప్రాప్ టైగర్ వెల్లడించిన రియల్ ఇన్సైట్ రెసిడెన్షియల్ రిపోర్ట్ ప్రకారం దేశంలోని ఎనిమిది నగరాల్లో జనవరి-మార్చిలో 70,620 ఇళ్లు, ఫ్లాట్ విక్రయాలు ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో ఐదు శాతం పెరిగి 74,330కి చేరుకున్నాయి. ఇక హైదరాబాద్లో అయితే ఇళ్ల విక్రయాలు ఏకంగా 21 శాతం పెరిగాయి. మొదటి త్రైమాసికంలో 6560 యూనిట్లు విక్రయించిన రియాల్టీ సంస్థలు, రెండో త్రైమాసికంలో 7910 యూనిట్లను విక్రయించాయి.
అహ్మదాబాద్లో మొదటి త్రైమాసికంలో 5550 కాగా, 30 శాతం వృద్ధి నమోదు చేసి 7240కి పెరిగాయి. ఢిల్లీ, చెన్నై, పుణేలలో మాత్రం క్షీణించాయి. హైదరాబాద్, అహ్మదాబాద్తో పాటు బెంగళూరు, కోల్కతా, ముంబైలలో విక్రయాలు పెరిగాయి. దక్షిణ భారత్లో హైదరాబాద్లోనే విక్రయాలు భారీగా పెరిగాయి.
కొత్త ప్రాజెక్టులు, ఇళ్ల సరఫరా ఏప్రిల్-జూన్ కాలంలో కోల్కతాలో రెండింతలు పెరగగా, హైదరాబాద్లో 13 శాతం వృద్ధి నమోదయింది. ప్రాజెక్టులోని ఇళ్లను పూర్తిగా విక్రయించేందుకు సగటున 34 నెలలు పడుతోంది. హైదరాబాద్లో ఇది 37 నెలలు కాగా, ఢిల్లీలో 65 నెలలుగా ఉంది. దేశంలోని ఎనిమిది నగరాల్లో 7.63 లక్షల అమ్ముడుపోని ఇళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు అనుమతి తీసుకున్న దశ నుండి ఇన్వెంటరీగా పరిగణిస్తున్నారు. హైదరాబాద్లో విక్రయం కాని ఇళ్లు 82,220 ఉన్నట్లుగా నివేదిక పేర్కొంది. ముంబైలో 2.72 లక్షలు, పుణేలో1.17 లక్షలు, ఢిల్లీలో 99,850, హైదరాబాద్లో 82,220, బెంగళూరులో 70 వేలు, అహ్మదాబాద్లో 64,860, చెన్నైలో 32,670, కోల్కతాలో 22,640 ఉన్నాయి.