అక్కడ తగ్గినా... ఇక్కడ పెరుగుతున్నాయి! ఈకామర్స్ సైట్లలో పెద్దవీ కొనేస్తున్న వినియోగదారులు
భారత్ లో ఏడాది కాలంగా ఆర్థిక మందగమనం నడుస్తోంది. అన్ని విభాగాల్లో అమ్మకాలు తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద వినియోగ వస్తువుల అమ్మకాలు భారీగా పడిపోతున్నాయి. కానీ, ఈ కామర్స్ రంగంలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. పెద్ద పెద్ద టీవీలు, రెఫ్రిజిరేటర్లు, ఏసీలు కూడా ఆన్లైన్ వెబ్సైట్లలో భారీగా అమ్ముడు పోతున్నాయి. ఒకప్పుడు ఆన్లైన్ లో కొనాలంటే కేవలం చిన్న చిన్న ప్రొడక్టులనే ఎంపిక చేసుకునే వారు. ఎందుకంటే అప్పుడప్పుడే ఈకామెర్స్ రంగం ఇండియా లో పురుడు పోసుకుంటోంది. 5-6 ఏళ్ళ క్రితం ఆన్లైన్ లో నకిలీల గొడవ అధికంగా ఉండేది. తక్కువ ధరలు చూపించి, కస్టమర్ల నుంచి పేమెంట్ లభించగానే ఇటుకలు, సబ్బులు, రాళ్లు డెలివరీ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ల రాకతో పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. అవి ప్రారంభైమైన కొత్తలో ఫ్లిప్కార్ట్, అమెజాన్ లకు కూడా నకిలీ బాధలు తప్పలేదు. కానీ క్రమంగా అవి టెక్నాలజీ వినియోగించి వాటికి చెక్ పెట్టాయి. అందుకే, ఇప్పుడు పేరున్న ఈ కామర్స్ పోర్టల్ లో ఒక ప్రోడక్ట్ ను చూస్తే, దాని ధర కూడా నచ్చితే వెంటనే ఆర్డర్ చేస్తున్నారు.
కొత్త ఆదాయపు పన్ను: శాలరైడ్కు ఆప్షన్, వ్యాపారం ఉంటే మాత్రం
2021 నాటికి 84 బిలియన్ డాలర్లు...
ఇండియా లో ఈ కామర్స్ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. పదేళ్ల క్రితం మొత్తం భారత రిటైల్ మార్కెట్లో 1% కూడా లేని ఈ కామర్స్ మార్కెట్ వాటా... ఇప్పుడు దాదాపు 10% నికి చేరువలో ఉంది. 2021 నాటికి ఇండియన్ రిటైల్ మార్కెట్ సైజు 1.2 ట్రిలియన్ డాలర్లు (రూ 70,14,000 కోట్లు) స్థాయికి చేరుకుంటుండగా... ఈ కామర్స్ రంగం వాటా 84 బిలియన్ డాలర్లు (రూ 5,88,000 కోట్లు) గా ఉండబోతోంది. ప్రతి ఏటా ఈ రంగం సుమారు 23% వృద్ధిని నమోదు చేస్తోంది. అదే సమయంలో సాంప్రదాయ రిటైల్ మార్కెట్ వృద్ధి మాత్రం 10% లోపే ఉంటోంది. మన దేశంలో ఇంటర్నెట్ వినియోగం నానాటికీ పెరిగిపోతుండటంతో ఈ కామర్స్ రంగం కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో సుమారు 42 కోట్ల మంది మొబైల్ లో ఇంటర్నెట్ వినియోగిస్తుండగా.. సుమారు 32 కోట్ల మంది ఆన్లైన్ లో కొనుగోళ్లు జరుపుతున్నారు. 130 కోట్ల మంది భారతీయుల్లో ఇంకా సగం మంది కూడా ఇంటర్నెట్ వినియోగించటం లేదు. అది కాస్తా 50% నుంచి 60% నికి పెరిగితే ఈ కామర్స్ రంగం ఇప్పుడున్న స్థాయికి రెట్టింపు కావటం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
25% వాటా సొంతం...
మార్కెట్లో వైట్ గూడ్స్ గా పరిగణించే టీవీలు, ఏసీలు, రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ లు వంటి భారీ వినియోగ వస్తువుల అమ్మకాలు ఇప్పుడు స్టోర్ల లో కంటే ఆన్లైన్ లో అధికంగా అమ్ముడవుతున్నాయి. దేశంలో అమ్ముడయ్యే మొత్తం ఈ వస్తువుల వాటాలో ఈ కామర్స్ రంగం దాదాపు 25% వాటాను ఆక్రమించేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. 2019 లో ఒక వైపు స్టోర్ల లో వీటి అమ్మకాలు దాదాపు 5% క్షీణిస్తే.. ఆన్లైన్ లో మాత్రం వాటి విక్రయాలు సుమారు 15% వృద్ధి చెందినట్లు అనలిస్టులు పేర్కొంటున్నారు. 2017, 2018 సంవత్సరాలతో పోల్చితే ఈ విభాగంలో ఈ కామర్స్ వాటా, అమ్మకాల్లో వృద్ధి విపరీతంగా పెరిగిందని చెబుతున్నారు. ఈ సరళి ఈ ఏడాది కూడా కొనసాగనుంది అంటున్నారు. సాధారణంగా టీవీలు, ఏసీలు వంటి భారీ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా వాటిని స్టోర్ల లో చూసి, పనితీరు బేరీజు వేసుకున్నాకే కొనుగోలు చేస్తారు. కానీ, ఇప్పుడు వినియోగదారుల అభిరుచులు మారిపోతున్నాయి.
ఆఫర్లు... రుణాలు...
ఈకామెర్స్ సైట్ల లో భారీ ఎలక్ట్రానిక్ గూడ్స్ విక్రయాలు పెరిగేందుకు మరో బలమైన కారణం కూడా ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. అదే భారీ ఆఫర్లు. స్టోర్ల ధరల కంటే కనీసం 20% నుంచి 30% వరకు తక్కువ ధరకు ఈకామెర్స్ వెబ్సైట్ల లో లభించటంతో కస్టమర్లు అటువైపే మొగ్గుచూపుప్తున్నారు. అలాగే, కస్టమర్లకు సులభమైన కొనుగోలు ఆప్షన్స్ కూడా లభిస్తున్నాయి. క్రెడిట్ కార్డులు, బజాజ్ ఫైనాన్స్, బ్యాంకులు అన్నీ కూడా ప్రతి కొనుగోలుకు ఈజీ ఈఎంఐ వెసులుబాటు కల్పిస్తున్నాయి. మరోవైపు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయటంతో వినియోగదారులు ఆన్లైన్ కే జై కొడుతున్నారు. ప్రతి ప్రోడక్ట్ కొనుగోలుపై ఎంతో కొంత క్యాష్ బ్యాక్ రావటం, లేదా రివార్డ్ పాయింట్లు జమ కావటంతో వస్తువుల వాస్తవిక ధరకంటే మరింత తక్కువ లో అవి లభిస్తున్నట్లే అవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇన్స్టలేషన్ కూడా ఉచితంగా లభిస్తోంది. స్మార్ట్ ఫోన్లు ఐతే చెప్పనక్కరలేదు. స్టోర్ల లో కంటే ఆన్లైన్ లోనే అధిక అమ్మకాలు నమోదు అవుతున్నాయి. కేవలం చిన్న చిన్న ఆక్సిస్సోరీస్ కోసం మాత్రమే వినియోగదారులు స్టోర్ల ను ఆశ్రయిస్తున్నారు. లాప్టాప్ ల కొనుగోలు సరళి కూడా ఇలాగే ఉంటోంది.