నియామకాలు పెరిగాయ్, PLI పథకంతో ఉద్యోగాల సృష్టి
కరోనా సెకండ్ వేవ్ ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి భారత్ దృఢ నిశ్యతంతో పని చేస్తోందని, దీంతో నియామకాలు దాదాపు స్థిరంగా ఉన్నాయని మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ ఔట్ లుక్ సర్వే పేర్కొంది. జూలై-సెప్టెంబర్ కాలంలో తయారీ, విద్య, ప్రజా పరిపాలన విభాగాలలో నియామకాలు బాగుంటాయని అభిప్రాయపడింది. ట్రాన్సుపోర్ట్, వినియోగం, సేవల రంగాలు నియామకాల పరంగా ముందు వరుసలో ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ ఔట్ లుక్ సర్వే పేరుతో ఈ నివేదిక విడుదలైంది.
PLIతో ఉద్యోగాల సృష్టి
భారత్వ్యాప్తంగా 1,303 సంస్థల నుండి వివరాలు సేకరించింది ఈ సంస్థ. వచ్చే అయిదేళ్ల కాలంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (PLI) కింద రూ.2 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించడం వల్ల ఉద్యోగాల సృష్టితో పాటు ఉత్పత్తి పెరుగుతుందని తెలిపింది. వ్యాక్సీన్ పంపిణీ మరింత విస్తృతమై, కస్టమర్ సెంటిమెంట్ మెరుగుపడితే సేల్స్, సేవలు, సరఫరా విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ట్రాన్సుపోర్ట్, వినియోగ రంగాల్లో నియామకాలు నికరంగా పది శాతం సేవల రంగంలో ఇది ఏడు శాతం, తయారీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, విద్యా రంగాల్లో ఆరు శాతం వృద్ధికి అవకాశమున్నట్లు తెలిపింది.
ఆ రంగాల్లో నియామకాలు స్తబ్దుగా
ఇన్సురెన్స్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో నియామకాలు పరిమితంగా ఉండవచ్చునని, హోల్సేల్, రిటైల్ వాణిజ్య రంగాల్లో నియామకాల అవకాశాలు కాస్త స్తబ్దుగా ఉండే అవకాశముందని తెలిపింది. గనులు, నిర్మాణ రంగాల్లో ఉద్యోగాల కోతకు ఆస్కారం ఉందని పేర్కొంది. దిగ్గజ కంపెనీలతో పోలిస్తే మధ్యతరహా కంపెనీల్లో నియామకాలకు ఎక్కువగా అవకాశాలు కన్పిస్తున్నాయి. మొత్తంగా రవాణా, సేవల రంగాల్లో
నియామకాలు ఆశాజనకంగా..
ఇదిలా ఉండగా, గత ఏడాది దేశంలో ఉద్యోగాల కోతలు, నిరుద్యోగ సమస్య ఆందోళనకర స్థాయికి పెరిగాయని, అయితే 2021 మాత్రం నియామకాల పరంగా ఆశాజనకంగా కన్పిస్తోందని మరో నివేదిక మెర్సర్ మెట్ల్ పేర్కొంది. తమ సర్వేలో పాల్గొన్న 60 శాతం కంపెనీలు ఈ ఏడాదిలో కొత్త నియామకాలు చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలో ఉద్యోగ నియామకాలు కరోనా పూర్వ స్థాయికి చేరుకోగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.