Anil Ambani: అంబానీ కంపెనీ వేలంలో ట్విస్ట్.. హిందూజా గ్రూప్ దూకుడుతో హడల్.. అసలేం జరుగుతోంది..
Anil Ambani: నష్టాలతో కూరుకుపోయిన అనిల్ అంబానీకి చెందిన చాలా కంపెనీలు వరుసగా వేలం జరుగుతోంది. ఇప్పటికే నావల్, రిలయన్స్ ఇన్ ఫ్రాటెల్ కంపెనీల బిడ్డింగ్ జరిగింది. అయితే ఇప్పుడు ఆయనకు చెందిన రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకు చాలా మంది నుంచి పోటీ పెరుగుతోంది.
బిడ్డింగ్ ట్విస్ట్..
రిలయన్స్ క్యాపిటల్ వేలం ప్రక్రియ రోజురోజుకూ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే హిందూజా గ్రూప్ తన కొత్త ఆఫర్ ప్రకటించటమే దీనికి ప్రధాన కారణంగా ఉంది. రూ.8,640 కోట్లను ఆఫర్ చేసిన టోరెంటో ఇన్వెస్ట్మెంట్స్ కంటే కంపెనీ రూ.760 కోట్లు ఎక్కువగా ఆఫర్ చేస్తూ రూ.9,400 కోట్లతో కొత్త బిడ్ దాఖలు చేసింది. దీంతో పోటీలో ఉన్న బిడ్డర్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
గడువు నాటికి..
రిలయన్స్ క్యాపిటల్ వ్యాపారాన్ని చేజిక్కించుకోవాలని నిర్ణయించిన హిందూజా గ్రూప్ నిర్ణయంతో కంపెనీకి క్రేజ్ పెరుగుతోంది. బిడ్డింగ్ సమయం పూర్తైన తర్వాత కంపెనీ భారీ మెుత్తానికి బిడ్ దాఖలు చేయటం పోటీలోని హీట్ ను పెంచేస్తోంది. అయితే ఇది బిడ్డింగ్ ప్రక్రియకు పూర్తిగా విరుద్ధమైనదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా హిందూజా గ్రూప్ వేసిన బిడ్ చెల్లుబాటు అవుతుందా..? లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
గతంలో హిందూజా గ్రూప్..
దీనికి ముందు హిందూజా రూ.8,110 కోట్ల బిడ్ దాఖలు చేసింది. అయితే కట్ ఆఫ్ తర్వాత ఆఫర్ను రూ.9,400 కోట్లకు పెంచింది. హిందూజా కొత్త ఆఫర్లో రిలయన్స్ క్యాపిటల్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి రూ.8,800 కోట్ల చెల్లింపు ఉంది. కంపెనీ ఇన్సూరెన్స్ నుంచి బ్రోకింగ్ వరకు 20 ఎంటిటీలను కలిగి ఉంది.
రిలయన్స్ క్యాపిటల్ వేలం..
అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ యాజమాన్యంలోని ఆర్ క్యాప్ రూ.24,000 కోట్ల విలువైన రుణాన్ని డిఫాల్ట్ చేసింది. దీంతో కంపెనీ గత ఏడాది రిజర్వు బ్యాంక్ కంపెనీ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (CIRP)కి సంబంధించి వై.నాగేశ్వరరావుని అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. ఈ ప్రక్రియ ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ కేంద్రంగా నడుస్తోంది.
కంపెనీ నష్టాలు..
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.3,966 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. కంపెనీ మొత్తం ఆదాయం Q3FY22లో రూ.4,083 కోట్లుగా ఉంది. Q3FY21లో రూ.4,890 కోట్లుగా ఉంది. ఈ కంపెనీని 1986 మార్చి 5న స్థాపించటం జరిగింది.