బంగాళాదుంపలు కొనలేని స్థితిలో సామాన్యులు .. ఈ దశాబ్దంలోనే అత్యధిక ధరలతో ఆలు మంటలు
ఒక దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా బంగాళదుంపల ధరలు విపరీతంగా పెరిగాయి. ఆలుగడ్డల ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి . ప్రస్తుతం బంగాళాదుంప యొక్క నెలవారీ సగటు ధర కిలో 40 రూపాయలుగా ఉంది. అక్టోబర్ నెలలో భారత దేశ వ్యాప్తంగా బంగాళాదుంపలు నెలవారీ సగటు రిటైల్ ధర 39.30 రూపాయలకు పెరిగింది. ఇది గత పది సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా పెరిగిన అత్యధిక ధర. విపరీతంగా పెరిగిన ధరల కారణంగా సామాన్యులకు తిప్పలు తప్పటం లేదు .
పండుగ షాపింగ్ కు సామాన్యులు దూరం .. ఆకాశాన్నంటిన నిత్యావసరాలు ,కూరగాయల ధరలే కారణం
విపరీతంగా పెరిగిన బంగాళాదుంపల ధరలు
ఈ నెలలో ఢిల్లీ లో బంగాళదుంప నెలవారీ సగటు రిటైల్ ధర కిలోకు 40 రూపాయలు గా ఉంది. గత ఏడాది అక్టోబర్ నెలలో కిలో 20 రూపాయలు ఉన్న బంగాళాదుంపలు, ఈ ఏడాది అక్టోబర్ నెలకు 40 రూపాయలకు పైగా చేరింది. గత ఏడాది ధరకంటే 60 శాతం ఎక్కువగా ఉంది. సాధారణంగా బంగాళదుంపల రిటైల్ ధరలు సెప్టెంబర్ నుండి నవంబర్ నెలలో ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల నుండే బంగాళదుంప ధరలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి.
తక్కువ నిల్వ .. ప్రజల డిమాండ్ .. ధరల పెరుగుదలకు కారణం
గత సంవత్సరాలతో పోలిస్తే తక్కువ నిల్వ ఉండడం, బంగాళాదుంపలకు నార్త్ లో ప్రజల నుండి ఎక్కువ డిమాండ్ ఉండడంతో ధరలు పెరిగినట్లుగా చెప్పొచ్చు. ఏప్రిల్, మే నెలల్లో లాక్ డౌన్ సమయంలో కూడా బంగాళా దుంపల ధరలు క్రమంగా పెరుగుతూనే వచ్చాయి. లాక్ డౌన్ ఎత్తి వేసిన అనంతరం కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రిత్వ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే
. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం తక్కువగా బంగాళదుంపల స్టాక్ ఉండడంవల్ల విపరీతంగా ధరలు పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది.
గతంతో పోలిస్తే కోల్డ్ స్టోరేజ్ లలో తక్కువ స్టాక్
వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాలు ప్రకారం, ఈ సంవత్సరం కోల్డ్ స్టోరేజ్లో బంగాళాదుంప 214.25 లక్షల టన్నులు స్టాక్ ఉన్నట్లుగా తెలుస్తుంది , 2018-19లో 238.50 లక్షల టన్నులు స్టాక్ ఉన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తక్కువ స్టాక్ ఉన్నట్టు లెక్క చెప్తుంది . వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, సామాన్యులకు భారంగా మారిన బంగాళాదుంపల ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న మంత్రి పీయూష్ గోయల్
గత కొన్ని రోజులుగా బంగాళాదుంప (రిటైల్) ధరలు రూ .42 వద్ద స్థిరంగా ఉన్నా ఉన్నాయని రాబోయే కొద్ది రోజుల్లో భూటాన్ నుండి 30,000 మెట్రిక్ టన్నుల బంగాళాదుంప రావడం ప్రారంభమవుతుందని గోయల్ చెప్పారు.బంగాళాదుంప ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అవి నియంత్రించబడతాయని ఆశిస్తున్నట్లు మంత్రి చెప్పారు. దిగుమతి సుంకం అంతకుముందు 30 శాతం ఉందని ఆయన అన్నారు. ఇప్పుడు, జనవరి 31, 2021 వరకు దిగుమతి కోసం 10 శాతం సుంకం వద్ద 10 లక్షల మెట్రిక్ టన్నుల బంగాళదుంపలు దిగుమతి చేయనున్నట్లుగా తెలిపారు