గుడ్న్యూస్: ఉల్లి ధరలు రూ.100కు పెరిగినా అక్కడ కిలో రూ.25కే!
అమరావతి: భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి పండించే రాష్ట్రాల్లో దిగుబడి తగ్గింది. దీంతో ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వినియోగదారులకు ఉల్లి భారం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు బజార్లలో ఉల్లిని రూ.25కే విక్రయించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించుకోవచ్చు
గురువారం మార్కెటింగ్ శాఖ అధికారులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. రూ.25 ధరకు రోజుకు 150 మెట్రిక్ టన్నుల ఉల్లిని రైతు బజార్లకు సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో నెల రోజుల పాటు ఇదే ధరకు ఇవ్వాలని సూచించారు. అవసరమైతే ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించుకోవాలన్నారు.
తక్కువ ధరకే రైతు బజార్లకు
ఈ సందర్భంగా మార్కెటింగ్ శాఖ ఏం చేస్తుందో అధికారులు వివరించారు. మార్కెట్లో ఉల్లి ధర నాణ్యత ప్రకారం కిలో రూ.62 నుంచి రూ.75 మధ్య ఉందని, వేలంలో కనీస ధర రూ.53 నుంచి రూ.62కు కొనుగోలు చేస్తున్నామని, రవాణా ఖర్చులు కలుపుకుంటే రూ.70 నుంచి రూ.72 ఖర్చులు అవుతున్నాయని చెప్పారు. రైతు బజార్లకు రూ.40 నుంచి రూ.45కు సరఫరా చేస్తున్నామని చెప్పారు. అయితే ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించుకోవాలని, రూ.25కు కిలో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అక్రమంగా నిలువ చేస్తే చర్యలు
కర్నూలు మార్కెట్కు వచ్చే సరుకులో సగాన్ని నేరుగా వేలంలో రైతుల నుంచి కొంటున్నట్లు అధికారులు చెప్పారు. పంట నష్టం కారణంగా దేశవ్యాప్తంగా ధరలు ఇలాగే ఉన్నట్లు చెప్పారు. ఉల్లిని అక్రమంగా నిలువ చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా, ఉల్లికి భారీ ధర రావడంతో పంట బాగా పండిన రైతులు సంతోషంగా ఉన్నారు.