చర్యలొద్దు: కార్వీకి తెలంగాణ హైకోర్టులో 'మధ్యంతర' ఊరట
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్కు(KSBL) మంగళవారం నాడు స్వల్పఊరట లభించింది. కార్వీ వ్యవహారంలో తుది తీర్పు వెలువడేవరకు ఎలాంటి చర్యలు చేపట్టరాదని కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సీరియస్ ఫ్రాండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO-తీవ్ర నేరాల దర్యాఫ్తు అధికారి)ని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 27వ తేదీన కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల శాఖ, జూన్ 16, 19 తేదీల్లో SFIO ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ కార్వీ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది.
గుడ్న్యూస్: అమెరికా కంటే మనవద్ద కరోనా ఔషధం ధర 80% తక్కువ
కార్వీ వాదన ఏమిటి
నిధుల మళ్లింపు అవకతవకలు జరిగాయని కార్వీ ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే తుది తీర్పు వెలువడే వరకు చర్యలు చేపట్టరాదని ఇప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో తాత్కాలిక ఊరట లభించింది. తమ సంస్థలో నిధుల మళ్లింపు అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై కేంద్రం తమ వాదన పట్టించుకోకుండా SFIO దర్యాప్తుకు ఆదేశించిందని, ఈ మేరకు తమకు నోటీసులు జారీ చేశారని తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కార్వీ హైకోర్టును కోరింది. కార్వీ తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం దర్యాఫ్తుకు ఆదేశించే ముందు ఓ అభిప్రాయానికి రావాల్సి ఉందని, మా వాదన విన్నాక దర్యాఫ్తులో ముందుకు వెళ్లాలని గతంలో సింగిల్ జడ్జి చెప్పినా పట్టించుకోలేదన్నారు. కంపెనీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు.
కేంద్రం ఏమంటోంది
కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు వాదనలు వినిపించారు. సెబీ, SFIO దర్యాప్తు ప్రకారం కార్వీ సంస్థలో అవకతవకలు నిజమేనని తేలిందని చెప్పారు. ఈ అంశాలు తీవ్రమైనవిగా పరిగణించిన కేంద్రం దర్యాఫ్తుకు ఆదేశించినట్లు తెలిపారు.
80వేలమంది ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు దెబ్బ
కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పర్యవేక్షణ కమిటీ కూడా దాని ప్రాంతీయ డైరెక్టర్ నివేదికను పరిశీలించినట్లు చెప్పారు. 80 వేలమంది ఇన్వెస్టర్ల ప్రయోజనాలు దెబ్బతినేలా కార్వీ నిధులను దుర్వినియోగం చేసిందన్నారు. సెబీ, SFIO ఉత్తర్వులు కూడా కార్వీకి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపింది. రూ.1,100 కోట్లను అప్పుల్లో కూరుకుపోయిన కార్వీ రియాల్టీలోకి మళ్లించిందని, దీనికి రూ.425 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. వాదనలు ముగిసిన అనంతరం న్యాయమూర్తి తీర్పును రిజర్వ్లో ఉంచారు. తదుపరి ఉత్తర్వుల వరకు SFIO విచారణ చేపట్టవద్దని ఆదేశించింది.