ఆర్థిక విపత్తుగా మారకుండా సహకరించాలి: నిర్మలా సీతారామన్
కరోనా మహమ్మారి ప్రభావం భారత ఆరోగ్య, ఆర్థిక పరిస్థితిపై తీవ్రంగా పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ADB) సహకారం కోరారు. కరోనా ప్రేరిత ఆరోగ్య సంక్షోభం పూర్తిస్థాయి ఆర్థికవిపత్తంగా మారకుండా వర్ధమాన దేశాలకు తగిన సాయం చేయాలని సూచించారు. ఏడీబీతో పాటు వివిధ బహుళజాతి రుణ సంస్థలకు నిర్మలమ్మ ఈ విజ్ఞప్తి చేశారు. మనీలా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఏడీబీ, గవర్నర్ల బోర్డు 54వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
ఆర్థిక రికవరీ పట్ల అప్రమత్తం
వర్థమాన దేశాలపై దీర్ఘకాలంలో కరోనా ప్రభావం పడకుండా చూడడానికి సమన్వయ, సమ్మిళిత అంతర్జాతీయ వ్యూహం అవసరమని నిర్మలమ్మ అన్నారు. 2020 తొలి 6 నెలల కాలంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అన్నీ కరోనా ప్రేరిత సవాళ్ల గుప్పిట్లోకి వెళ్లిపోయాయని, ఆ తర్వాత మళ్లీ రికవరీ జాడలు కనిపించాయని, కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి తిరిగి విజృంభిస్తోందని, కొత్త కేసులు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయన్నారు. ఆర్థిక రికవరీ పట్ల అప్రమత్తంగా ఉంటూ, జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ప్రస్తుతం మనముందు ఉందన్నారు.
ఇటీవల పేదరికం తగ్గినప్పటికీ
ప్రపంచ ఆర్థిక ఫలాలను సంరక్షించుకోడానికి అభివృద్ధి చెందిన దేశాలు, బహుళజాతి బ్యాంకింగ్ సంస్థలు వర్థమాన సభ్య దేశాలకు అండగా నిలవాలని నిర్మలమ్మ సూచించారు. గత కొద్ది సంవత్సరాలుగా పేదరికం క్రమంగా తగ్గుతోందని, కానీ 2020లో కరోనా ఒక్కసారిగా 7.8 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టివేసిందన్నారు. ఆదాయ అసమానతలు భారీగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సవాళ్లను ఎదుర్కోవడానికి ఏడీబీ తనవంతు ప్రయత్నాన్ని సమర్థవంతంగా నిర్వహించిందన్నారు.
దీర్ఘకాలిక లక్ష్యాలకు గండి
ఏడీబీ ఇప్పుడు వ్యాక్సినేషన్ విస్తృతికి కృషి చేస్తోందని నిర్మలమ్మ అన్నారు. భారత్ విషయంలో కరోనా, నాన్ కోవిడ్ ప్రాజెక్టులకు ఏడీబీ సకాలంలో తగిన మద్దతును అందించిందన్నారు. గతంలో ఎప్పుడూ చూడని ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నామని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీగా క్షీణించిందన్నారు. వర్ధమాన దేశాల దీర్ఘకాల పురోభివృద్ధి లక్ష్యాలకు గండిపడిందన్నారు.