వేడి గాలులు, తగ్గిన బొగ్గు స్టాక్: ఈ రాష్ట్రాల్లో గంటలకొద్ది పవర్ కట్
దేశవ్యాప్తంగా తీవ్ర బొగ్గు కొరత ఏర్పడింది. దీంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, గుర్గావ్ తిదర ప్రాంతాల్లో విద్యుత్ సంక్షోభం తలెత్తింది. దేశ రాజధానిలో బొగ్గు కొరత ఏ స్థాయిలో ఉందంటే ఆసుపత్రులు, మెట్రోలకు కూడా కరెంట్ కట్ చేసే పరిస్థితులు ఉన్నట్లు హెచ్చరించింది. తక్షణమే రాజధానిలోని విద్యుత్ ప్లాంట్స్ బొగ్గు సరఫరాను పెంచాలని కోరింది. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కేంద్రానికి లేఖ రాశారు. విపరీతమైన వేడిగాలులకు తోడు భారత్ గత ఆరేళ్లలోనే భారీ విద్యుత్ ఉత్పత్తి సమస్యను ఎదుర్కొంటోంది.
విద్యుత్ డిమాండ్ పెరిగింది
గత కొంతకాలంగా విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగించే ప్రధాన వనరు బొగ్గు కొరతతో ఇబ్బందులు పడుతోంది భారత్. దేశంలో బొగ్గు నిల్వలు కనీసం తొమ్మిదేళ్లలోనే మొదటిసారి వేసవి ముందు కనిష్టానికి చేరుకున్నాయి. విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకారం భారత్లో పీక్-పవర్ డిమాండ్ గురువారం గురువారం గరిష్టస్థాయికి చేరింది. వచ్చే నెలలో ఇది 8 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.
విద్యుత్ కోతలు
రాయిటర్స్ ప్రకారం ఏప్రిల్ మొదటి 27 రోజులలో విద్యుత్ సరఫరా కంటే 1.88 బిలియన్ యూనిట్లు లేదా 1.6 శాతం తగ్గింది. జమ్ము కాశ్మీర్ నుండి ఆంధ్రప్రదేశ్ వరకు రెండు గంటల నుండి ఎనిమిది గంటల విద్యుత్ కోత అమలవుతోంది. ఢిల్లీలోని రెండు ప్రధాన విద్యుత్ స్టేషన్లు దాద్రి-2, ఊంచహార్ ప్లాంట్లలో బొగ్గు కొరత ఏర్పడింది. ఢిల్లీలో అవసరమయ్యే విద్యుత్ డిమాండ్లో 25 శాతం నుండి 30 శాతం ఈ స్టేషన్ల నుండి వస్తుంది. ఈ రెండు పవర్ ప్లాంట్స్ వద్ద ఇప్పుడు చాలా తక్కువ మొత్తంలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఆసుపత్రులు, మెట్రో స్టేషన్ల వంటి ఎమర్జెన్సీ సేవలకు కూడా 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కష్టతరమవుతుందని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది.
అందుకే వినియోగం జంప్
ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైన ఉంది. దీంతో కరెంట్ వినియోగం భారీగా పెరిగింది. డిమాండ్కు తగిన విద్యుత్ సరఫరా కోసం బొగ్గు కొరత సమస్యగా మారింది. పలు ప్లాంట్స్లో బొగ్గు ఏడెనిమిది రోజుల స్టాక్ మాత్రమే ఉంది. ఢిల్లీకి బొగ్గు సరఫరా పెంచేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా ఉండేందుకు కొన్ని ప్రయాణీకుల రైళ్లను కూడా రద్దు చేసిందట. అయితే ఈ రద్దు తాత్కాలికమే. సాధారణ స్థితికి వచ్చాక పునరుద్ధరిస్తారు.
ఈ రాష్ట్రాల్లో కొరత
ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్తాన్, కేరళ, పంజాబ్ రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి.
ఢిల్లీలో మొదటిసారి పీక్ -పవర్ డిమాండ్ 6000 మెగావాట్లకు చేరుకుంది. ఇందుకు విపరీతమైన వేడి గాలులు కారణం. హర్యానాలో విద్యుత్ డిమాండ్ 9000 మెగావాట్లకు పెరగింది. కానీ 1500 మెగావాట్ల కొరత కనిపిస్తోంది. దీంతో 4 నుండి 6 గంటల విద్యుత్ కోత కనిపిస్తోంది. ఉత్తర ప్రదేశ్లో అయితే 3000 మెగావాట్ల విద్యుత్ కొరత కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 23,000 మెగావాట్లు కాగా, 20,000 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సగటున 18 గంటలకు బదులు 15 గంటలు సరఫరా అవుతోంది.
ఆంధ్రప్రదేశ్లో 210 మిలియన్ యూనిట్లు అవసరం కాగా, 50 మిలియన్ యూనిట్లు తక్కువ పడుతున్నాయి. తెలంగాణలోను విద్యుత్ కోత ఉంది.
బీహార్లో విద్యుత్ డిమాండ్ 6000 మెగావాట్లు కాగా, 300 మెగావాట్ల వరకు తక్కువ పడుతోంది.
రాజస్థాన్లో 7 గంటల వరకు విద్యుత్ కోత ఉంది. కేరళలో బొగ్గు కొరత కారణంగా 400 మెగావాట్ల విద్యుత్ కొరత ఉంది.
పంజాబ్లో అయితే 40 శాతం వరకు కొరత కనిపిస్తోంది.