మెహుల్ చోక్సీ కాలిక్యులేటివ్, సొంతగా కిడ్నాప్ ప్లాన్ చేశాడా?
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో కీలక నిందితుడు మెహుల్ చోక్సీ ఆంటిగ్వా నుండి పారిపోయి డొమినికాలో పట్టుబడటంపై అతని సహచరులు స్పందించారు. అతను చాలా కాలిక్యులేటివ్ అని, కాబట్టి తనకు తానే కిడ్నాప్ డ్రామా ఆడి, అందరి అటెన్షన్ను డైవర్ట్ చేసే ఆలోచన కావొచ్చునని, తద్వారా సానుభూతి పొందవచ్చుననే ఆలోచన లేకపోలేదని అంటున్నారు. మరోవైపు, చోక్సీని ఇప్పట్లో భారత్కు అప్పగించే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఆంటిగ్వా నుండి అదృశ్యమై డొమినికా పోలీసులకు చిక్కిన చోక్సీకి సంబంధించి రెండు కేసులు అక్కడి కోర్టుల్లో విచారణ దశలో ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఈ కేసుల్లో తీర్పు వచ్చేంత వరకు చోక్సీని భారత్కు పంపించే అవకాశం లేదు.
చోక్సీపై అక్కడ కేసు
ఈ క్రమంలో చోక్సీని భారత్ తీసుకు వచ్చేందుకు వెళ్లిన భారత దర్యాప్తు సంస్థల బృందం తిరిగి స్వదేశానికి చేరుకుంటోంది. మే 23న ఆంటిగ్వాలో అదృశ్యమైన చోక్సీని ఆ తర్వాత రెండో రోజులకు పక్కనే ఉన్న డొమినికా దేశంలో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. చోక్సీని అక్రమంగా డొమినికాకు తీసుకెళ్లారని ఆయన తరపు న్యాయవాదులు వాదించగా, అక్రమంగానే దేశంలోకి ప్రవేశించారని డొమినికా పోలీసులు తెలిపారు.
అప్పటి వరకు అక్కడే
చోక్సీ అక్రమంగా డొమినికాలో ప్రవేశించారని కేసు నమోదు చేయడంతో విచారణ జరుగుతోంది. ఈ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, కోర్టు తిరస్కరించింది. దీనిపై విచారణను జూన్ 14వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు చోక్సీ కోసం ఆయన లాయర్లు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణ జులైకి వాయిదా పడింది. దీంతో చోక్సీని భారత్ తీసుకురావడం అప్పుడే సాధ్యం కాకపోవచ్చు
స్వదేశానికి దర్యాప్తు బృందాలు
భారత్ నుండి డొమినికా వెళ్లిన ఈడీ, సీబీఐ అధికారుల బృందం తిరిగి స్వదేశానికి పయనమైంది. శుక్రవారం రాత్రి ఈ బృందం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోనుంది. అంతకుముందు భారత్కు అప్పగించాలని కోర్టులో పత్రాలు సమర్పించింది. PNBలో రూ.13,500 కోట్ల మేర మోసం చేసి మెహుల్ చోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయాడు. మెహుల్ చోక్సీ ఆంటిగ్వా-బార్బుడా నుండి డొమినికా మీదుగా క్యూబా పారిపోతుండగా డొమినికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.