నగదు సేకరణ, పేమెంట్ గేట్వే: HDFC బ్యాంకు-మీసేవ కీలక ఒప్పందం
HDFC బ్యాంకు ప్రభుత్వరంగ మీ-సేవతో చేతులు కలిపింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మరింత విస్తృతంగా సేవలు అందించేందుకు, వారి డోర్ స్టెప్స్కు తీసుకు వెళ్లేందుకు రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది. మీసేవ గవర్నమెంట్ టు సిటిజన్ (G2C), గవర్నమెంట్ టు బిజినెస్ (G2B) సేవలు అందిస్తోంది. ఇందులో 250కి పైగా ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు.
కరోనా వైరస్ దెబ్బ: ఒక్కరోజులో రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి
అన్ని రకాల సేవలు నిర్వహించుకోవచ్చు
మీ-సేవ-HDFC బ్యాంకు ఒప్పందంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4500 శాఖల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన 500కి పైగా సేవలకు సంబంధించిన అన్ని రకాల చెల్లింపులను నిర్వహించుకోవచ్చు. బ్యాంకు పేమెంట్ గేట్వేను, క్యాష్ మేనేజ్మెంట్ ద్వారా విద్యుత్, టెలిఫోన్ బిల్లులు, ఆస్తి పన్ను చెల్లింపులు, ఆధార్ వివరాలు నమోదు ప్రక్రియ, నివాసం, జనన, మరణ దృవీకరణ పత్రాలకు సంబంధించిన ఛార్జ్ను చెల్లించవచ్చు.
110 మీ సేవ కేంద్రాల నుంచి నగదు సేకరణ
ప్రభుత్వం నిర్వహిస్తున్న దాదాపు 110 మీసేవ కేంద్రాల నుండి నగదును సేకరించడం, 4,500 ఫ్రాంచైజీ మీ సేవా కేంద్రాలకు పేమెంట్ గేట్ వే సేవలను బ్యాంకు అందించడం చేస్తుంది. మీ సేవ ద్వారా ప్రతి రోజు లక్షలాది మంది సేవలు పొందుతున్నారు. నెలకు రూ.356 కోట్ల వరకు టర్నోవర్ ఉంటుంది.
ప్రతి రెండేళ్లకోసారి బ్యాంకు ఎంపిక
ప్రతి రెండేళ్లకోసారి టెండర్ ప్రక్రియ ద్వారా బ్యాంకు ఎంపిక చేస్తామని, ఇందులో భాగంగా HDFC బ్యాంకుతో అవగాహన ఒప్పందం కుదిరిందని తెలంగాణ ప్రభుత్వ ఈఎస్డీ, ఐటీఈ అండ్ సీ కమిషనర్ వెంకటేశ్వర రావు తెలిపారు. వినియోగదారులకు కావాల్సిన ఆర్థిక సేవలను అన్నీ అందించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మీ-సేవ సేవలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొందన్నారు.
మరింతమందికి చేరువయ్యేలా..
ప్రభుత్వ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించేందుకు మీసేవ కృషి చేస్తోందని, ప్రభుత్వంతో చేతులు కలపడం ద్వారా మరింత మంది ఖాతాదారులకు చేరువయ్యేందుకు వీలవుతుందని భావిస్తున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంకు సర్కిల్ హెడ్ బద్రీ విశాల్ అన్నారు. డిసెంబర్ 31, 2019 నాటికి తెలంగాణలో 222 HDFC బ్యాంకులు, 1,010 ఏటీఎంలు ఉన్నాయి.