గుడ్న్యూస్: ఐటీలో వేలాది ఆఫర్స్, HCLలో 15,000 ఉద్యోగాలు
భారత టెక్ దిగ్గజం HCL టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000 మంది ఫ్రెషర్స్ను క్యాంపస్ నియామకం ద్వారా నియమించనుంది. గత ఏడాది 9,000 మంది ఉద్యోగులను తీసుకుంది. ఈసారి అంతకుమించి (6,000 ఎక్కువ) ఫ్రెషర్స్ను నియమించుకోనుంది. కరోనా మహమ్మారి సమయంలో వివిధ రంగాల్లో ఉద్యోగాల కోత సమయంలో టెక్ దిగ్గజాలు శుభవార్త చెబుతున్నాయి. ఇప్పుడు హెచ్సీఎల్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.
86% తగ్గిన ఆ ఖర్చు: ఐటీ ఉద్యోగులకు గుడ్న్యూస్, డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్
అందుకే కొత్త ఉద్యోగాలు
ఈ నియామకాలు రెండు పారామీటర్స్ పైన ఆధారపడి ఉంటున్నాయని, ఒకటి బలమైన వృద్ధి, రెండు ఖాళీలను పూరించే నేపథ్యంలో ప్రెషర్స్కు ఉద్యోగ అవకాశాల వైపు మొగ్గు చూపుతున్నట్లు హెచ్సీఎల్ హెచ్ఆర్ హెడ్ అప్పారావ్ వీవీ తెలిపారు. ఇటీవల ఇన్ఫోసిస్ కూడా వేలాది మంది ఉద్యోగులను నియమించుకుంటామని వెల్లడించింది. తదుపరి క్వార్టర్ నుండి వృద్ధి పెరగవచ్చునని అంచనాలు ఉన్నాయి. దీంతో హెచ్సీఎల్ క్యాంపస్ రిక్రూట్మెంట్లపై దృష్టి పెట్టింది.
వర్చువల్ నియామకాలు
టీసీఎస్, విప్రో వంటి ఇతర టెక్ కంపెనీల మాదిరిగానే హెచ్సీఎల్ కూడా తన నియామకాలను వర్చువల్గా చేపట్టనుంది. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో క్యాంపస్లలో ప్రెషర్ల ఎంపిక ప్రక్రియ నెమ్మదిగా ఉందని ఏప్రిల్-జూన్ క్వార్టర్లో దాదాపు వెయ్యిమంది ఫ్రెషర్లను నియమించుకున్నట్లు తెలిపింది. ప్రెషర్స్ వార్షిక వేతనాలు రూ.3.5 లక్షలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈసారి బలమైన డిమాండ్ ఉంటుందని, వృద్ధి అంచనాలు పెరుగుతాయని హెచ్సీఎల్ సహా టెక్ సంస్థలు భావిస్తున్నాయి.
కంపెనీని వీడే ఉద్యోగుల సంఖ్య తగ్గింది
ఈ ఏడాది కంపెనీని వీడే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు హెచ్ఆర్ హెడ్ వీవీ అప్పారావు వెల్లడించారు. హెచ్సీఎల్ టెక్నాలజీస్ జూన్ క్వార్టర్ ఏకీకృత నికర లాభం 31.7 శాతం పెరిగి రూ.2,925 కోట్లు నమోదు చేసింది. కంపెనీ ఆధాయం రూ.8.6 శాతం పెరిగి రూ.17,841 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.16,425 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆ ప్రభావం ఆదాయంపై పడిందని, అయితే బలమైన డిమాండ్ పరిస్థితులు ఉన్నట్లు కంపెనీ సీఈవో ప్రకటించారు.
ఐటీ రంగంలో వేలాది ఉద్యోగాలు..
భారత అతిపెద్ద ఐటీ ఎగుమతిదారు టీసీఎస్ గత ఏడాది 40,000 ప్రెషర్స్ను చేర్చుకున్నామని, ఈసారి కూడా అంతేస్థాయిలో ఉద్యోగాలు ఉంటాయని తెలిపింది. అలాగే, ఇండియన్ క్యాంపస్ల నుండి 12,000 మందిని తీసుకుంటామని విప్రో ప్రకటించింది. ఈ క్వార్టర్లో లాభాలు తగ్గినప్పటికీ రెండు లేదా మూడో క్వార్టర్ నుండి వృద్ధి పుంజుకుంటుందని భావిస్తున్నాయి.