హార్లే డేవిడ్సన్ అనూహ్యనిర్ణయం, భారత్లో ప్లాంట్ మూసివేత: 70 ఉద్యోగులకు షాక్
అమెరికా లగ్జరీ మోటార్ సైకిల్స్ దిగ్గజం హార్లే డేవిడ్సన్ భారత్ నుండి నిష్క్రమించింది. దేశంలో ప్రీమియం బైక్స్ విక్రయం మొదలు పెట్టిన దశాబ్దం తర్వాత తన అమ్మకాలు, మ్యానుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలను నిలిపివేస్తోంది. ఈ మేరకు గురువారం ఆ కంపెనీ అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థకు తెలియజేసింది. ఈ కంపెనీ 2009లో భారత మార్కెట్లోకి అఢుగు పెట్టింది. అయితే ఇక్కడి కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు స్థానికంగా భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలని చూస్తోందని తెలుస్తోంది. ప్రస్తుత వినియోగదారులకు సేవల్ని అందించేందుకు స్థానిక భాగస్వామి కోసం కంపెనీ ఎదురు చూస్తోందని సమాచారం.
అతి తక్కువ ధరకే క్రూడాయిల్, భారత్ నిల్వలతో 685 మిలియన్ డాలర్ల ఆదా
70 మంది ఉద్యోగుల తొలగింత
భారత్ నుండి నిష్క్రమణలో భాగంగా ఇక్కడ ఉన్న 70 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. హర్యానా బవాల్లోని తయారీ ప్లాంట్ను మూసివేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ 500 మంది ఉద్యోగులు తొలగించే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా డీలర్ నెట్ వర్క్ తగ్గింపులు, కొన్ని మార్కెట్ల నుండి నిష్క్రమణల్లో భాగంగా భారత్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ను నిలిపివేస్తున్నట్లు కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. మొత్తం కంపెనీ విక్రయాల్లో భారత్లో అమ్మకాలు ఐదు శాతం కంటే తక్కువగా ఉంటాయి. దీంతో నిష్క్రమణ అనివార్యమైంది.
రీస్ట్రక్చరింగ్ యాక్టివిటీస్
2020 రీస్ట్రక్చరింగ్ యాక్టివిటీస్లో భాగంగా సిబ్బంది తగ్గింపు, కొన్ని దేశాల్లో వ్యాపారాల కుదింపు వంటి నిర్ణయాలు అమలు చేస్తోంది. వివిధ ప్రాంతాల్లో కార్యకలాపాల నిలిపివేత, సిబ్బంది తగ్గింపు తదితర వివరాల కోసం మొత్తం మీద ఈ ఏడాది పునర్నిర్మాణ వ్యయాలు అదనంగా 75 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. దాదాపు రూ.550 కోట్లకు పైగా పునర్నిర్మాణ వ్యయాలు ఉంటాయి. కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తోంది. రానున్న 12 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. హార్లే డేవిడ్సన్ బైక్స్ పైన భారత్ భారీగా పన్నులు వేస్తోందని గతంలో ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే.
ఏకైక తయారీ కేంద్రం
అమెరికా వెలుపల కంపెనీకి ఉన్న ఏకైక తయారీ కేంద్రం హర్యానాలో ఉంది. అలాగే, గురుగ్రామ్లో సేల్స్ పాయింట్ ఉంది. దీని పరిమాణాన్ని తగ్గించనున్నట్లు హార్లే డేవిడ్సన్ తెలిపింది. భారత్లోని తన కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేయడంతో పాటు భవిష్యత్తులో ఉత్పత్తిపరంగా సహకారం అందుతుందని తెలిపింది. కాంట్రాక్ట్ స్థలం వరకు ప్రస్తుత డీలర్ల నెట్ వర్క్ కొనసాగుతుందని తెలిపింది. కంపెనీ విక్రయాలు, సేవలు పరిమిత కాలం కొనసాగుతాయి. తమ వ్యాపార విధానాన్ని మార్చుకోవడంతో పాటు భారత్ కస్టమర్లకు సేవలు అందించే ఆప్షన్స్ను పరిశీలిస్తామని హార్లే డేవిడ్సన్ తెలిపింది. తమ వ్యాపారాన్ని ఇక్కడ ముందుకు తీసుకెళ్లే భాగస్వామి కోసం చూస్తోంది.
హార్లే డేవిడ్సన్ వచ్చింది ఇలా..
2007లో భారత ప్రభుత్వం కాలుష్య ఉద్గార, పరీక్షా నియామకాల్లో సడలింపులు ఇచ్చింది. దీంతో హార్లే డేవిడ్సన్ బైక్స్ ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయింది. 2009లో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించింది. మరుసటి ఏడాది మొదటి డీలర్ షిప్ నియామకం, విక్రయాలు మొదలు ప్రారంభించింది. 2011లో హర్యానాలోని ప్లాంట్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 11 మోడల్స్ విక్రయిస్తోంది.