మరో సారి జీఎస్టీ పిడుగు: పన్ను రేటు పెరుగుతుందా?
దేశంలో జీఎస్టీ అమలు చేసిన దగ్గర నుంచి అది ఎవరికీ పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదు. ఒకే దేశం ... ఒకే పన్ను అంటూ ఊదరగొట్టినా ఆచరణలో ఘోరంగా విఫలమైంది. పలు రకాల పన్నులు ... వందల సార్లు మార్పులతో జీఎస్టీ అంటేనే బ్రహ్మ పదార్థం అనే స్థాయికి వచ్చింది పరిస్థితి. ప్రారంభంలో ఉన్నట్లు భారీ టాక్సులు కాకుండా వినియోగదారులకు కొంత ఉపశమనం ఇవ్వాలని చాలా ఉత్పత్తులపై జీఎస్టీ ని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. మరి కొన్నింటిపై పూర్తిగా రద్దు చేసింది. అయినా కూడా జీఎస్టీ వసూళ్లు ఆశించన మేరకు జరగటం లేదు. ఇందుకు కేవలం పన్ను రేటు మాత్రమే కారణం కానప్పటికీ వ్యాపారులకు అనువుగా లేని కారణంగా వసూళ్లు పెరగటం లేదు. అమల్లోకి వచ్చిన తర్వాత అతి కొద్దీ నెలల్లో మాత్రమే జీఎస్టీ వసూళ్లు రూ లక్ష కోట్లు దాటాయి. తొంభై శాతం వరకు రూ 90 వేళ కోట్ల మేరకే జరుగుతున్నాయి. దీంతో జీఎస్టీని మరో సారి సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలూ సేకరించే పనిలో పడింది. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది.
ఈ నెల 18న భేటీ...
జీఎస్టీ వసూళ్లను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు అనేక ఇతర అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం డిసెంబర్ 18న జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానుంది. ఇందుకోసం కొంత కాలం నుంచే కౌన్సిల్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 27న అన్ని రాష్ట్రాల జీఎస్టీ కమీషనర్లకు లేఖలు రాసింది. జీఎస్టీ రాబడి పెంచుకునేందుకు అవసరమైన చర్యల కోసం వారి సలహాలు, సూచనలు, ప్రతిపాదనలు చేయాల్సిందిగా అందులో జీఎస్టీ కౌన్సిల్ రాష్ట్రాల కమిషనర్లను కోరింది. దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకొన్న తర్వాత... జీఎస్టీ కౌన్సిల్ ఒక నిర్ణయాత్మక చర్య తీసుకొనే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రాల వాటా చెల్లింపులో జాప్యం ...
జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ... పన్నులను వసూలు చేసి తొలుత కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. అందులోనుంచి రాష్ట్రాల వాటాలను కేంద్ర ప్రభుత్వం తిరిగి రాష్ట్రాలకు పంపుతుంది. కానీ రెండేళ్లుగా ఏ ఒక్క నెలలో కూడా ఆశించిన మేరకు జీఎస్టీ వసూళ్లు రాకపోవటంతో... రాష్ట్రాల కు రావాల్సిన వాటాల చెల్లింపులో కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్టీ కి ముందు రాష్ట్రాలకు సొంత రాబడి ఉండేది. కానీ ఇప్పుడు వాటి చేతులను జీఎస్టీ పేరుతొ కేంద్ర ప్రభుత్వం కట్టిపడేసింది. అదే సమయంలో తమ వాటాను సమయానుకూలంగా ఇవ్వకపోవటంతో రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి.
రేటు పెంపు ...
ప్రస్తుతం జీఎస్టీ రేట్లు పలు రకాలుగా ఉన్నాయి. కానీ మెజారిటీ వస్తువులు, సేవలు మాత్రం 12% , 18% పన్ను పరిధిలో ఉన్నాయి. అయితే, ఈ రెండింటినీ కలిపి సుమారు 15% పన్ను రేటును ప్రతిపాదించే అవకాశం లేకపోలేదని టాక్స్ అడ్వైసర్స్ అంటున్నారు. అలాగే, ఇప్పటివరకు పన్ను పరిధిలో లేని కొన్ని రంగాలపై స్వల్ప పన్ను విధించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. అదే జరిగితే జీఎస్టీ వసూళ్లు పెరిగి, రాష్ట్రాలకు అందాల్సిన వాటాలు సమయానుకూలంగా లభిస్తాయని పేర్కొంటున్నారు. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే కూడా ఇది స్పష్టమవుతోంది. ప్రస్తుతం చాలా రేట్లు, అధిక పన్ను ఉంటోందని.. పన్ను సరళీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై రాష్ట్రాలతో మెరుగైన చర్చలు జరుగుతున్నాయని నిర్మల సీతారామన్ తెలిపారు. పన్ను సరళీకరణలో భాగంగా పన్ను స్థిరీకరణకు అవకాశం ఉందని చెప్పారు.
రూ 1 లక్ష కోట్లు...
చాలా కాలం తర్వాత జీఎస్టీ వసూళ్లు నవంబర్ మాసంలో పెరిగాయి. పండుగల సీజన్లో జరిగిన అమ్మకాల వల్ల రాబడి పెరిగింది. నవంబర్ లో జీఎస్టీ వసూళ్లు 6% పెరిగి రూ 1,03,492 కోట్లకు చేరుకున్నాయి. అయితే ఇదే సరళి కొనసాగుతుందని చెప్పటం కష్టం. అందుకే డిసెంబర్ 18 న జరిగే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో తీసుకొనే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పన్ను రేట్ల కంటే కూడా పన్ను చెల్లించకపోతే విధించే పెనాల్టీలు అధికంగా ఉండటంతో వ్యాపారాలు అసలు మొత్తాన్ని పన్ను చెల్లించకుండా ఉండి పోతున్నారు. ఈ విషయాన్నీ ప్రభుత్వం గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.