ఆగస్టులో బాగా తగ్గిన జీఎస్టీ వసూళ్లు - పరిహారం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచిన రాష్ట్రాలు
కరోనా మహమ్మారి దేబ్బకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. ప్రధానంగా ఇండియాలోనైతే ఆ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. చరిత్రలో తొలిసారి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మైనస్ 23.9 శాతానికి పడిపోయింది. లాక్ డౌన్ సడలింపుల తర్వాత కూడా ఆర్థిక రంగం ఆశించిన స్థాయిలో కోలుకోలేదనడానికి నిదర్శనంగా ఆగస్టు నెలలో సైతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు బాగా తగ్గాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు మంగళవారం ప్రకటన చేసింది.
కరోనా వల్ల అన్ని రంగాలూ దెబ్బతినడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు రూ 86,449 కోట్లు మాత్రమే వచ్చాయని ఆర్థిక శాఖ తెలిపింది. గతేడాది ఇదే నెలలో రూ.98,202 కోట్లు మేర జీఎస్టీ వసూలు కాగా.. అప్పటితో పోలిస్తే 11,553 కోట్ల మేర ఆదాయం తగ్గిపోయినట్టు చెప్పింది. గతేడాదేకాదు.. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం గత రెండు నెలలతో పోల్చుకున్నా ఆగస్టులో గణాంకాలు తక్కువగా ఉండటం గమనార్హం. ఈ ఏడాది జూన్ లో రూ.90,917 కోట్లు, జులైలో 87,422 కోట్లు చొప్పున వసూలు కాగా, ఆగస్టులో మాత్రం 86,449 కోట్లు వసూలయ్యాయి.
ఆగస్టు నెలకు సంబంధించిన వసూళ్లలో కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) ద్వారా రూ.15,906 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ(ఎస్జీఎస్టీ) ద్వారా రూ.21,064 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) ద్వారా రూ.42,264 కోట్లు మేర సమకూరినట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. సెస్ల రూపంలో రూ.7215 కోట్లు వచ్చిందని తెలిపింది. రూ.5కోట్ల లోపు టర్నోవర్ కలిగిన పన్ను చెల్లింపుదారులకు రిటర్నుల ఫైలింగ్కు సెప్టెంబర్ వరకు గడువు ఉండటంతో ఈసారి వసూళ్లు తగ్గి ఉంటాయని ఆర్థిక శాఖ భావిస్తున్నది. మరోవైపు.
జీఎస్టీ వసూళ్లు నానాటికీ తగ్గిపోతూ, ఆర్థిక కష్టాలు రెట్టింపవుతోన్న దరిమిలా కేంద్ర సర్కారుపై పలు రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి. జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. జీఎస్టీ చట్టాన్ని కేంద్ర సర్కారే ఉల్లంఘిస్తున్నదని, పూర్తి పరిహారం చెల్లించాల్సిందేనని పలు రాష్ట్రాలు పట్టుపడుతున్నాయి. తెలంగాణ సహా బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్న ఐదు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ మేరకు సోమవారం సమావేశమై, కేంద్రంపై ఉమ్మడి పోరాటానికి తెరలేపారు.