Budget 2021: బడ్జెట్లో ఇంటి ఊరట దక్కేనా, నిర్మలమ్మ ఆ స్కీం పొడిగిస్తారా?
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రేపు (ఫిబ్రవరి 1, సోమవారం) కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. ఈ కరోనా కష్టకాలంలో రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా భారీగా దెబ్బతిన్నది. ఈ రంగం బడ్జెట్ పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. రియాల్టీ రంగానికి గత బడ్జెట్లోను మంచి ప్రాధాన్యత కల్పించారని, అయితే కరోనా నేపథ్యంలో మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. నిలిచిపోయిన ప్రాజెక్టులకు లిక్విడిటీ సమస్యను తీర్చాలని ఈ రంగం కోరుతోంది. హోంలోన్ వడ్డీ పైన రూ.5 లక్షల వరకు రిబేట్ కోరుతోంది.
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు.. చదవండి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన
సొంతింటి కలను నెరవేర్చేందుకు కేంద్రం 2015లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ పథకం కింద ఇల్లు కట్టుకునే వారికి లేదా కొనుగోలు చేసే వారికి సబ్సిడీ ద్వారా గృహ రుణాన్ని అందిస్తుంది. అత్యధికంగా రూ.2.67 లక్షల వరకు రాయితీని పొందవచ్చు. వార్షిక ఆదాయం రూ.18 లక్షల వరకు ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక సొంతింటి కలను నెరవేర్చడం కోసం తీసుకు వచ్చిన ఈ పథకం రియాల్టీ రంగానికి ఊతమిచ్చేదే.
అలాగే కరోనా కారణంగా వడ్డీ రేట్లు తగ్గాయి. ఇప్పుడు బడ్జెట్లో మరిన్ని ఊరట చర్యలు ప్రకటిస్తే రియాల్టీ రంగం వేగంగా పుంజుకుంటుందని భావిస్తున్నారు.
పొడిగిస్తారా?
ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీం కోసం బలహీన వర్గాలు, తక్కువ ఆదాయం కలిగిన వారు, మధ్య ఆదాయం కలిగినవర్గం 1, మధ్య ఆదాయం కలిగిన వర్గం 2 అనే నాలుగు కేటగిరీలు ఉన్నాయి. ఇందులో రెండు కేటగిరీలకు ఈ స్కీం గడువు మరో రెండు నెలలు మాత్రమే ఉంది. వీరికి పొడిగిస్తారని భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నందున స్కీంను పొడిగించడమే మేలని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
రియాల్టీ రంగం వాటా 8 శాతం
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో రియాల్టీ రంగం వాటా 8 శాతంగా ఉంది. కరోనాతో కునారిల్లిన రియాల్టీ రంగం ఈ బడ్జెట్ పైన ఆశలు పెట్టుకుంది. డిమాండ్కు ఊతమిచ్చేలా చర్యలు ఉంటాయని భావిస్తోంది.