జీఎస్టీలో ఇక మూడు పన్ను స్లాబ్స్ మాత్రమే, 5% నుండి 8%కు పెంపు!
వస్తు, సేవల పన్ను (GST) స్లాబ్స్ హేతుబద్దీకరణ సహా మరిన్ని కీలక మార్పులకు జీఎస్టీ కౌన్సిల్ సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. జీఎస్టీ హేతుబద్దీకరణ ద్వారా ఆదాయాలు పెరిగి రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడవలసిన అవసరం లేకుండా చేయాలని చూస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు ఓ నివేదికను పలు రాష్ట్రాల ఆర్థికమంత్రుల బృందం ఈ నెలాఖరులో మండలికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జీఎస్టీ స్లాబ్ రేట్లు పెరగనున్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం 5 శాతం స్లాబ్ కనిష్టం. దీనిని 8 శాతానికి పెంచనున్నారని తెలుస్తోంది. అలాగే జీఎస్టీ నుండి ప్రస్తుతం మినహాయింపు పొందుతున్న జాబితాను కూడా తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ ఉత్పత్తులపై జీఎస్టీ వడ్డీ రేట్లు తగ్గించాలని ఇప్పటికే వివిధ రంగాల నుండి విజ్ఞప్తులు, డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వచ్చే నెలలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమయంలో జీఎస్టీని ఐదు శాతం నుండి ఎనిమిది శాతానికి పెంచే అంశంపై నిర్ణయం తీసుకుంటారు.
అలాగే 12 శాతం పన్ను స్లాబ్ రేటును పూర్తిగా తొలగించి, ఆ పరిధిలోని ఉత్పత్తులను 18 శాతం స్లాబ్ పరిధిలోకి తీసుకు రావాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. విలాస వస్తువులు 28 శాతం స్లాబ్లో ఉన్నాయి. కొన్ని విలాసవంత వస్తువులు, సిన్ గూడ్స్ పైన అదనంగా సెస్ ఉంది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని జీఎస్టీ అమలు వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకే ఇస్తోంది కేంద్రం.
ఐదు శాతం పన్ను స్లాబ్ రేటును 8 శాతానికి పెంచడం వల్ల ప్రతి సంవత్సరం అదనంగా రూ.1.50 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. జీఎస్టీ లెక్క ప్రకారం అతి తక్కువ పన్ను స్లాబ్ను 1 శాతం పెంచితే అదనంగా రూ.50వేల కోట్లు వస్తుంది. మూడు శాతం పెరిగితే రూ.1.50 లక్షల కోట్లు అవుతుంది.