జీఎస్టీ కలెక్షన్లు సరికొత్త రికార్డ్, 1.67 లక్షల కోట్లు క్రాస్: ఎందుకంటే
ఏప్రిల్ జీఎస్టీ కలెక్షన్లు అదరగొట్టాయి. జీఎస్టీ చరిత్రలో మొదటిసారి వసూళ్లు రూ.1.50 లక్షల కోట్లు క్రాస్ చేశాయి. వరుసగా రెండో నెల రికార్డ్ కలెక్షన్లు నమోదయ్యాయి. మార్చి నెలలో రూ.1,42,095 లక్షల కోట్లతో రికార్డ్ సృష్టిస్తే, ఏప్రిల్ నెలలో మరో 18 శాతం పెరిగి, రూ.1,67,540 కోట్లతో ఆ రికార్డును తిరగరాసింది. ఏడాది ప్రాతిపదికన అంటే 2021 ఏప్రిల్ నెలతో పోలిస్తే 20 శాతం అధికం.
ఇందులో తెలంగాణ నుండి రూ.4955కోట్లు, ఆంధ్రప్రదేశ్ నుండి రూ.4067 కోట్లు ఉన్నాయి. గతంలో ఎన్నడు లేనివిధంగా గత నెల 20న కేవలం ఒక్కరోజులోనే రూ.9.58 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.57,847 కోట్ల జీఎస్టీ వసూలైంది. దీంతో మొత్తం ఏప్రిల్ నెలలో రూ.1.67 లక్షల కోట్లు దాటింది.
ఇందులో సీజీఎస్టీ రూ.33,159 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.41,793 కోట్లు, వస్తు దిగుమతులపై రూ.36,705 కోట్లతో కలిపి ఐజీఎస్టీ రూ.81,939 కోట్లు, సెస్ రూపంలో రూ.10,649 కోట్లు వసూలు అయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఫలితంగా కేంద్రానికి రూ.66,582 కోట్లు, రాష్ట్రాలకు రూ.68,755 కోట్లు వచ్చాయి. దేశంలో కరోనా తగ్గి, ఆర్థిక రికవరీ, వ్యాపార కార్యకలాపాలు పెరగడంతో పాటు పన్ను చెల్లింపు విధానాన్ని సులభతరం చేయడం, సకాలంలో పన్ను చెల్లించనివారిపై కఠిన చర్యల వంటి అంశాలు జీఎస్టీ భారీ వసూళ్లు వసూళ్లకు కారణమని తెలిపింది.
మార్చి నెలలో 97 లక్షల మంది వ్యాపారులు జీఎస్టీఆర్-3బీ రిటర్న్స్ దాఖలు చేస్తే, ఏప్రిల్ నెలలో ఆ సంఖ్య 1.06 కోట్లకు చేరుకుంది. జీఎస్టీ వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగాయి. ఏడాది ప్రాతిపదికన ఏప్రిల్ నెలలో 22 శాతం, తెలంగాణలో 16 శాతం వసూలు అయ్యాయి. జాతీయ వృద్ధి 19.92 శాతంగా ఉంది. కర్నాటకలో 19 శాతం పెరిగింది.