మెట్రో సిటీల్లో సొంత వాహనాలకే జనం మొగ్గు- పెరిగిన అమ్మకాలు- బ్యాంకింగ్ కూ కొత్త ఊపు...
కరోనా వైరస్ రాకముందు దారుణంగా కుదేలైన ఆటోమొబైల్ రంగంలో తాజాగా కదలిక కనిపిస్తోంది. అదీ మొత్తంగా కాదు. కేవలం వ్యక్తిగత వాహనాల విభాగంలో మాత్రమే. కరోనా వైరస్ వ్యాప్తి భయాలతో మెట్రో నగరాల్లో జనం వ్యక్తిగత వాహనాలవైపు ఎక్కువగా మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అంతిమంగా ఇది బ్యాంకింగ్ రంగానికీ కొత్త ఊపు తీసుకొస్తోంది.
అట్లాస్ సైకిల్స్ చివరి తయారీ యూనిట్ తాత్కాలిక మూసివేత .. ఆర్ధిక కష్టాలే కారణమట!!
ఆటోమొబైల్ రంగానికి మళ్లీ ఊపు...
కరోనా వైరస్ లాక్ డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సడలింపులతో మెట్రో నగరాల్లో వాహనాలు క్రమంగా రోడ్లపైకి వస్తున్నాయి. కంటైన్ మెంట్లు లేని చాలా చోట్ల ఇప్పటికే వాహనాలు రోడ్లపైకి వచ్చేశాయి. రెడ్ జోన్లు తొలగించాక మిగతా వాహనాలు కూడా రోడ్లపైకి రావడం ఖాయం. అదే సమయంలో కొత్త వాహనాల అమ్మకాల్లోనూ కాస్త కదలిక కనిపిస్తోంది. హైదరాబాద్ తో పాటు దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాల్లోనూ వాహనాల అమ్మకాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి.
వ్యక్తిగత వాహనాలకే మొగ్గు....
దేశవ్యాప్తంగా పలు చోట్ల కరోనా లాక్ డౌన్ మినహాయింపులతో ప్రజా రవాణా తిరిగి ప్రారంభమైనా జనం మాత్రం అటు వైపు చూసేందుకు ఇష్టపడటం లేదు. కరోనా వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి ప్రజా రవాణాకు దూరంగా ఉండటమే మేలని జనం భావిస్తున్నారు. దీంతో ప్రజా రవాణాకు బదులుగా వ్యక్తిగత వాహనాలు కొనుక్కునేందుకే జనం ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా పెరిగిన వ్యక్తిగత వాహనాల అమ్మకాలే ఇందుకు నిదర్శనం. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రెండు వారాల్లో పదివేల వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లు జరిగినట్లు ఆటోమొబైల్ సంస్ధల యజమానులు చెబుతున్నారు.
ఆర్ధిక ఇబ్బందులున్నా...
ప్రస్తుత లాక్ డౌన్ పరిస్ధితుల్లో రెండు నెలలుగా ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా సంస్ధలు ఉద్యోగాల్లో, వేతనాల్లో కోత విధించాయి. ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో తిరిగి సాధారణ జీవనం ప్రారంభించాలంటే ప్రజా రవాణా కూడా అందుబాటులో లేదు.. దీంతో అప్పో సొప్పో చేసి సొంత వాహనాలు కొనేందుకే జనం ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. క్రెడిట్ కార్డులు, ప్రీ అప్రూవుడ్ ఆఫర్లతోనే వాహనాల కొనుగోలుకు వీరు సిద్ధమవుతున్నట్లు తాజా ట్రెండ్స్ చెబుతున్నాయి.
బ్యాంకింగ్ రంగానికీ ఊపు...
కరోనా వైరస్ వ్యాప్తి భయాలతో జనం వ్యక్తిగత వాహనాలను అశ్రయిస్తుండటం బ్యాంకింగ్ రంగానికీ మేలు చేయనుంది. అసలే జనం ఆర్ధిక ఇబ్బందులతో లోన్లను సైతం మారటోరియం ఇవ్వాల్సిన పరిస్ధితులు నెలకొనడంతో బ్యాంకింగ్ రంగం కుదేలైంది. కొత్తగా లోన్లు తీసుకునేందుకు కస్టమర్లు ఆసక్తి చూపడం లేదు. ప్రీ అప్రూవుడ్ లోన్ ఆఫర్లు ఉన్నా కస్టమర్లు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో వ్యక్తిగత వాహన రుణాల విభాగంలో కదలిక రావడం బ్యాంకింగ్ వర్గాలనూ సంతోషంలో ముంచెత్తుతోంది. టూవీలర్, ఫోర్ వీలర్ విభాగాల్లో సేల్స్ పెరిగే కొద్దీ జనం ప్రస్తుత పరిస్ధితుల్లో లోన్ల కోసం తిరిగి బ్యాంకులకు క్యూ కడతారనే అంచనాలున్నాయి.