15 ఏళ్లకు పైబడిన వాహనాలు 4 కోట్లు, 70 లక్షలతో కర్ణాటక ఫస్ట్
మన దేశంలో 4 కోట్ల పాత వాహనాలు ఉన్నాయని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్సుపోర్ట్ అండ్ హైవేస్ తెలిపింది. అంటే పదిహేనేళ్లకు పైగా పాతబడిన వాహనాలు ఈ మేరకు ఉన్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 4 కోట్ల డొక్కు వాహనాలు ఉన్నట్లు లెక్క తేలింది. ఇందులో దాదాపు 70 లక్షల వాహనాలు ఒక్క కర్ణాటకలో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ వివరాల్ని డిజిటలైజ్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, లక్షద్వీప్ వివరాలు అందుబాటులోకి రాలేదు.
పదిహేనేళ్లు పైబడిన వాహనాలను పాత లేదా డొక్కు వాహనాలుగా పరిగణిస్తారు. వీటితో కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. వీటి వాడకాన్ని తగ్గించేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తీసుకు వచ్చిందే స్వతంత్ర వాహన తుక్కు విధానం. అలాగే ఇలాంటి పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధించేందుకు కేంద్రం సిద్ధమౌతోంది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపింది.
4 కోట్ల పాత వాహనాల్లో రెండు కోట్లు 20 ఏళ్లకు పైబడినవి కూడా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కర్ణాటకలో 70 లక్షల పాత వాహనాలు ఉండగా, ఉత్తర ప్రదేశ్ 56.64 లక్షలు, ఢిల్లీ 49.93 లక్షలతో ఆ తర్వాత ఉన్నాయి. కేరళలో 34.64 లక్షలు, తమిళనాడులో 33.43 లక్షలు, పంజాబ్లో 25.38 లక్షలు, పశ్చిమ బెంగాల్లో రూ.22.69 లక్షలు ఉన్నాయి.